గంగిరెడ్డి అనుచరుడి అరెస్టు: దొంగల ముఠాల పట్టివేత
చిత్తూరు/ అనంతపురం: ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డి ప్రధాన అనుచరుడైన చంద్రశేఖర్ అలియాస్ టైల్స్ రాజాను టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం శేషాచలం అటవీ ప్రాంతంలో అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసే 19 ఎర్రచందనం దుంగలతో సహా కారును స్వాధీనం చేసుకున్నారు.
టైల్స్ రాజాతో పాటు అతని అనుచరుడు, సుధీర్, తమిళనాడుకు చెందిన మరో 20 మంది ఎర్రచందనం కూలీలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్ గంగిరెడ్డి దుబాయ్లో అజ్ఞాతంలో ఉండి తన అనుచరుల ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో తిరుపతి, చిత్తూరు పోలీసులు గంగిరెడ్డి అనుచరుల కోసం వేట కొనసాగిస్తున్నారు.
అనంతపురం జిల్లా పోలీసులు రెండు దొంగల ముఠాలను అరెస్టు చేసి రూ.22 లక్షల విలువ చేసే 73 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను అనంతపురం అడిషనల్ ఎస్పీ కె. మాల్యాద్రి ఆదివారం వివరించారు. కనగానపల్లి మండలం కేంద్రానికి చెందిన అంకే జగదీష్కుమార్ అలియాస్ జగదీష్, కడప జిల్లా పులివెందులకు చెందిన బూశిపల్లి శివకుమార్రెడ్డిలను అరెస్టు చేసి రూ.13 లక్షల విలువ చేసే 44 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇందులో కీలకమైన అంకే జగదీష్కుమార్ ఎంబిఎ పూర్తి చేసి ప్రస్తుతం న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నాడన్నారు. ఇతని తండ్రి కనగానపల్లి మండలం మాజీ జడ్పిటిసి సభ్యుడు కావడం గమనార్హం. విలాసాలకు అలావాటు పడి సహచరుడితో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న వీరిపై జిల్లా కేంద్రంలో 12 కేసులు నమోదయ్యాయి.
మరో ముఠాలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి తొమ్మిది లక్షల విలువ చేసే 29 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాలో నీరిషికారి సుజానే అలియాస్ రాము, నీరిషికారి కాశీ, మాదెప్పగారి బోయ మహేష్, చింతకాయల బాలరాజు అలియాస్ మర్తాడు బాలరాజు ఉన్నారు. వీరంతా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారు.