అమరావతి శంకుస్థాపన ఖర్చు రూ.300 కోట్లు! వీఐపీలకు 'దుమ్ము' లేకుండా
అమరావతి: అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని నభూతో నభవిష్యతి అన్న విధంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. మిగతా రాష్ట్రాలు, ఆహ్వానితులు ఆశ్చర్యపోయేలా ఈ కార్యక్రమాన్ని మునుపెన్నడూ లేని రీతిలో ఘనంగా నిర్వహించాలనుకుంటోంది.
ఇందుకోసం రూ.300 కోట్లకు పైగానే వెచ్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. రహదారుల ఏర్పాటు, వాటి విస్తరణ, పొలాలను చదును చేసేందుకే రూ.80 కోట్ల వరకూ వెచ్చిస్తున్నట్టుగా సమాచారం. అత్యవసరం, యుద్ధ ప్రాతిపదికన అంటూ, ప్రతి పనినీ నామినేషనల్ పద్ధతులపై అప్పగిస్తూ, శరవేగంగా ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.
వీలైనన్ని విమానాలు, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది. దాదాపు 250 ఎకరాల్లో చలువ పందిళ్లను వేయాలని ఆదేశించింది. ఈ ఏర్పాట్లన్నీ తాత్కాలికమే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 10 లక్షల మందిని సమీకరించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది.

ఈవెంట్ నిర్వహించే సంస్థకు ఫీజు రూపంలో రూ.10 కోట్లు చెల్లించనున్నట్టు తెలుస్తోంది. నేషనల్ హైవే నుంచి తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయుని పాలెం గ్రామానికి నాలుగు రహదారులను అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తూ, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.
మరో నాలుగు రోజుల్లో పనులు మొత్తం పూర్తయ్యేలా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. విజయవాడలోని అన్ని ప్రధాన రహదారుల విద్యుద్దీకరణ, అక్కడి నుంచి రాజధాని ప్రాంతాలకు తరలే రహదారుల సుందరీకరణకు రూ.20 కోట్లు ఖర్చవుతోంది. దీంతో పాటు దేశ విదేశీ ప్రముఖులకు బస, వారి రాకపోకలు, వారిని సులువుగా అమరావతికి చేర్చేందుకు సాధ్యమైనన్ని హెలికాప్టర్లను అద్దెలకు తీసుకోనుంది.
వీఐపీలకు ఇబ్బంది లేకుండా... తారు రోడ్లు
అమరావతి శంకుస్థాపన కోసం దేశ, విదేశీ ప్రముఖులు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా ఎందరో వస్తున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీలు వచ్చే రహదారుల్లో... మట్టి రోడ్లు ఉన్న దృష్ట్యా, వాటిని తొలగించి ఆ స్థానంలో తారు రోడ్లు వేయాలని ఏపీ పోలీసులు రెవెన్యూ అధికారులను కోరారు.
శంకుస్థాపనకు వచ్చే వచ్చే దారి... ఒండ్రు మట్టి, బురద మట్టితో ఉంటుంది. ఇవే దారుల్లో వీఐపీలు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది లేకుండా రోడ్లను తారు రోడ్లుగా మార్చాలని చెప్పారు.
లేదంటే పెద్ద ఎత్తున వచ్చే వాహనాల వల్ల దుమ్ము లేవడం, ట్రాఫిక్ జామ్తో వీఐపీలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతేకాదు, రెయిన్ ప్రూఫ్ టెంట్లు పెద్ద ఎత్తున సమకూర్చుతున్నారు. శంకుస్థాపన నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఏర్పాటు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications