కేబినెట్ ప్రక్షాళనపై కొత్త చిక్కులు - ఆ ఒక్కటే పరిష్కారమా : సీఎం జగన్ ఫైనల్ డెసిషన్..!!
ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం సమీపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ కాదు..ప్రక్షాళనే అని తేల్చి చెబుతున్నారు. మంత్రులతోనూ ఇప్పటికే సీఎం జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వంలో - పార్టీలో మార్పులు ఖాయమని తేల్చి చెబుతున్నారు. మూడేళ్ల క్రితమే మంత్రివర్గం మార్పులు ఉంటాయనే విషయాన్ని చెప్పిన సంగతిని సీఎం గుర్తు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా.. కొత్త కేబినెట్ కూర్పు పైన కొన్ని చిక్కులు మొదలవుతున్నాయి. మంత్రులంతా బయటకు తాము సీఎం ఆదేశాలను పాటిస్తామని..జగన్ కోసం పని చేస్తామని చెబుతున్నారు. కానీ, కొత్తగా తమ స్థానంలో తమ జిల్లా నుంచి ఎవరికి ఇస్తారనే అంశంలోనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

పెద్దిరెడ్డిని తప్పిస్తారా..వాట్ నెక్స్ట్
చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి కుటుంబం జగన్ పార్టీ ఏర్పాటు నుంచి అన్ని రకాలుగా అండగా నిలిచింది. పెద్దిరెడ్డికి జగన్ తన తొలి కేబినెట్ లో కీలక శాఖ అప్పగించారు. మిథున్ రెడ్డికి లోక్ సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి పార్టీ గెలుపు కోసం కీలకంగా పని చేసారు. ప్రత్యేకించి కుప్పం నియోజవకర్గంలో చంద్రబాబు ను దెబ్బ తీయటానికి వ్యూహాత్మకంగా వ్యవహరించి..అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచేలా చేసారు. అయితే, ఇప్పుడు విస్తరణలో భాగంగా పెద్దిరెడ్డిని తప్పించటం ఖాయమని తెలుస్తోంది. కానీ, పెద్దిరెడ్డిని తప్పిస్తే..అదే సామాజిక వర్గానికి చెందిన వారికి జిల్లాలో ఎవరికి ఇస్తారనే చర్చ యొదలైంది. అందులో రోజా.. చెవిరెడ్డి.. భూమన పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, దీని పైన పెద్దిరెడ్డి కొంత అయిష్టంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీకి పెద్దగా తనకు అవకాశం ఇచ్చినా.. మంత్రి పదవితో జిల్లాలో కొత్త పెత్తనం మొదలయ్యే అవకాశం ఉంటుందనేది పెద్దిరెడ్డి వర్గీయుల వాదన.

అందరినీ తప్పిస్తేనే మేలంటూ
ఇప్పటి వరకు జిల్లాలో పార్టీకి తిరుగులేని విధంగా పెద్దిరెడ్డి అన్నీ తానై నడిపిస్తున్న వేళ..పెద్దిరెడ్డిని పక్కన పెట్టి మరొకరికి మంత్రి పదవి ఇస్తే అది నష్టం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే విధంగా బొత్సాను సైతం తప్పించటం ఖాయంగా కనిపిస్తోంది. బొత్సాను తప్పించి..విజయనగరం నుంచి ఎవరికి ఇస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. బొత్సా అభిప్రాయం సైతం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక, ప్రకాశం జిల్లాలో బాలినేని తొలి నుంచి జగన్ కోసం ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు తాను సిద్దమని చెబుతూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు ప్రకాశం కు చెందిన మరో మంత్రి సురేష్ ను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా సురేష్ ను కొనసాగిస్తారని ప్రచారం సాగుతోంది. జిల్లాకు చెందిన ఇద్దరినీ తప్పిస్తే..అది విధాన పరమైన నిర్ణయంగా ఉంటుందని.. సురేష్ ను కొనసాగించటం ద్వారా ప్రతికూల ప్రభావం ఉంటుందని బాలినేని వర్గీయులు చెబుతున్నట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
అదే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్దిక మంత్రి బుగ్గన కీలకంగా ప్రభుత్వంలో వ్యవహరిస్తున్నారు. బుగ్గనను తప్పించి..అదే జిల్లాకు చెందిన జయరాములను కొనసాగించటం ద్వారా కార్యకర్తల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో..ఒకే సారి విధాన పరమైన నిర్ణయంలో భాగంగా.. అందరినీ తప్పించి..మొత్తంగా కొత్త వారికి అవకాశం ఇస్తే సమస్య ఉండదనే వాదన వినిపిస్తోంది. అందరినీ తప్పించటం.. కొత్త వారితోనే కేబినెట్ రూపకల్పన చేయటం ద్వారా ఏ విధమైన సమస్యలకు అవకాశం ఉండదనేది పార్టీ ముఖ్య నేతల వాదన. దీంతో..సీఎం జగన్ ప్రధానంగా పెద్దిరెడ్డి లాంటి వారి విషయంలో చివరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు..అందరినీ తప్పిస్తారా లేక, కొందరిని కొనసాగిస్తారా.. ఆ తరువాత ఏం జరగబోతోందనేది ఇప్పుడు పార్టీలో ఉత్కంఠతకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications