టీ ఎమ్మెల్యేలు కారు ఎక్కి బాబు, జగన్లకు షాకిస్తారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు చేరనున్నారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. దీనికి సంబంధించి తెరాస ముఖ్యనేతతో వారు సంప్రదింపులు కూడా జరిపారట.
ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు జూన్ రెండుకు ముందే తెరాస నేతలతో చర్చలు జరిపారు. ఒకేసారి కాకుండా దఫదఫాలుగా పార్టీ మారాలని వారు తొలుత భావించారని అంటున్నారు. అయితే, అనర్హత వేటును తప్పించుకోవడానికి ఇప్పుడు మూకుమ్మడిగా పార్టీ మారాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.
ఇటీవల తెరాస ముఖ్య నేతతో వైయస్సార్ కాంగ్రెసు, టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆషాడ మాసం ఉన్నందున శ్రావణంలో మంచటి ముహూర్తం చూసుకొని, బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోగా తెరాసలో చేరాలనుకుంటున్నారట. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొని రావడానికి టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వాలు నిరసన తెలపక పోవడాన్ని నిలదీయాలని వారు భావిస్తున్నారట.
త్వరలో వారు తమ పార్టీల వైఖరిని ఖండిస్తూ ప్రకటనలు కూడా చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎమ్మెల్సీలు కూడా కారు ఎక్కనున్నారని అంటున్నారు. తెరాసలో చేరేందుకు.. పోలవరం అంశాన్ని అస్త్రంగా వాడుకోవాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.
టీడీపీకి చెందిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్), కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు, అదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు తెరాసకు అనుబంధ సభ్యుడిగా కొనసాగాలని భావిస్తున్నారట. అయితే, వీరంతా తమ పైన అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట.