రమణదీక్షితులును జైల్లో పెట్టి నాలుగు తగిలిస్తే..: సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేంకటేశ్వరస్వామితో ఎవరు పెట్టుకున్నా నాశనమైపోతారని, స్వామివారి జోలికొస్తే భక్తుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు టీటీడీపై నీచంగా మాట్లాడుతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. వెంకటేశ్వరస్వామి గురించి ఆడుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు.

రమణదీక్షితులును జైల్లో పెట్టి..
అంతేగాక, మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులను జైల్లో పెట్టి నాలుగు తగిలిస్తే నిజాలు బయటపడతాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతనేం తప్పులు చేశారో బయటపడుతుందని అన్నారు.

సోమిరెడ్డి శాపనార్థాలు
వెంకన్నతో పెట్టుకున్నవారు అనుభవిస్తారు, నాశనమైపోతారంటూ సోమిరెడ్డి శాపనార్థాలు పెట్టారు. హద్దుమీరి మాట్లాడుతున్నారంటూ బీజేపీ, వైసీపీలపై మండిపడ్డారు. వారికి అనుభవించే కాలం దగ్గర్లోనే ఉందని అన్నారు.

రాజకీయ కారణాలతోనే..
ఇక టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు బోండా ఉమా మాట్లాడుతూ.. రాజకీయ కారణాలతోనే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పగడ్బందీ వ్యవస్థ కలిగిన టీటీడీలో అవకతవకలకు తావులేదని ఆయన స్పష్టంచేశారు. ఆగమశాస్త్రాన్ని అనుసరించే ఆలయ నిర్వహణ కొనసాగుతోందని వివరించారు. 72 ఏళ్ల రమణదీక్షితులు టీటీడీ సహకారంతో ఇప్పటివరకు ఏడేళ్ల పదవీవిరమణ పొడిగింపు పొందారని అన్నారు.

మహానాడుకు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు
కనీవినీ ఎరుగని రీతిలో 2018 మహానాడు జరగనుందని మంత్రులు మంత్రులు కళా వెంకట్రావ్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం విస్తృత చర్చలు జరుగనున్నాయని తెలిపారు. ఈ వేదికగా కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేస్తామని స్పష్టం చేశారు.

మోడీ, జగన్ లాలూచీ రాజకీయాలు
ప్రతిపక్షాల కుట్ర రాజకీయాలను ఎండకడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను బలహీన పరుస్తోందని, అవినీతిపరులతో, దోపిడీదారులతో జత కట్టేందుకు ప్రధాని దిగజారారని వారు విమర్శించారు. మోడీకి జగన్కి మధ్య లాలూచీ రాజకీయాలు ఉన్నాయని, ఈ అంశాలపై మహానాడులో చర్చిస్తామని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందని అన్ని కుట్రలను మహానాడులో ఎండకడతామని మంత్రులు అన్నారు. రోజుకు 36వేల మంది కార్యకర్తలు హాజరయ్యే వేడుక ఇదని మంత్రులు తెలిపారు.












Click it and Unblock the Notifications