జగన్ మద్దతిస్తే తీసుకుంటాం: సోమిరెడ్డి ఆసక్తికరం, మోడీపై రివర్స్ గేర్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం నాడు నిప్పులు చెరిగారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం నాడు నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి జగన్ ఏం చెప్పారో తెలియాలని డిమాండ్ చేశారు.

జగన్ ప్రవాసాంధ్రుడు
ఆయన ప్రధాని దగ్గర చెప్పింది ఒకటి, బయటకు వచ్చి చెప్పింది మరొకటని విమర్శించారు. అసలు రైతుల గురించి ఆయన మాట్లాడటం ఏమిటన్నారు. మేం ఆంధ్రులం అయితే, జగన్ ప్రవాసాంధ్రుడు అని నిప్పులు చెరిగారు.

భేటీపై అభ్యంతరం లేదు కానీ..
విభజన జరిగి ఇన్నాళ్లవుతుందని, కానీ జగన్ కనీసం నెల రోజులైనా ఏపీలో నిద్ర చేశారా అని నిలదీశారు. మోడీతో జగన్ భేటీపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కానీ ఆయన మాట్లాడిన తీరుపైనే అభ్యంతరకరమన్నారు.

మోడీ చండశాసనుడు.. కాళ్లు మొక్కితే కనికరం లభించదు
తాను ప్రజా సమస్యలపై కలిశానని జగన్ చెప్పారని, కానీ కలిసింది మాత్రం వాటి కోసం కాదన్నారు. అవినీతిపరుల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చండశాసనుడు అని జగన్ కాళ్లు మొక్కితే కనికరం లభించదన్నారు. మోడీ వంటి నేత వద్ద జగన్ అవినీతి ఆటలు సాగవని తమకు తెలుసునని చెప్పారు.

అప్పుడు జగన్ మాకు మద్దతిస్తామంటే ఓకే
వైసిపి అధినేత జగన్ అక్రమాస్తుల కేసు నుంచి బయటపడితే, ఆ తర్వాత తమకు మద్దతిస్తామంటే అప్పుడు ఆలోచిస్తామని సోమిరెడ్డి అన్నారు. కానీ ప్రధానితో భేటీపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

అసలు మీ స్టాండ్ ఏమిటి
అసలు ప్రత్యేక హోదా, ఎన్డీయే విషయంలో వైసిపి స్టాండ్ ఏమిటో జగన్ చెప్పాలన్నారు. మిర్చి సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని జగన్ చెప్పారని, మరి ఆ విషయాలు మాట్లాడారా అని నిలదీశారు. కాగా, నిన్నటి దాకా బీజేపీని, మోడీని టిడిపి నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం మోడీ అలాంటి అవినీతి మనుషులను వెనుకేసుకు రాడని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications