హైదరాబాద్ యుటి చేయాలంటాం: కెసిఆర్పై సోమిరెడ్డి
గ్రేటర్ హైదరాబాదులోని 24 శాసనసభా స్థానాల్లో తెరాస 3 స్థానాలు మాత్రమే గెలుచుకుందని, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తెరాసను తిరస్కరించారని ఆయన అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడాన్ని స్థానికులు అంగీకరించలేదని కెసిఆర్ అనడంపై ఆయన ఆ విధంగా అన్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు తెలంగాణలో పునరావాసం కల్పిస్తామని ఆయన చెప్పారు. వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని ఆయన చెప్పారు.
కెసిఆర్కు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టారని, తమ నాయకుడంటే ఈర్ష్యాద్వేషాలు ఎందుకని ఆయన అన్నారు. చంద్రబాబు రెంటికి చెడ్డ రేవడి అవుతారని, జగన్ సీమాంధ్రలో సిఎం అవుతారని కెసిఆర్ అన్నారని, కెసిఆర్ మాట ఏమైందని ఆయన అన్నారు. తెలంగాణలో తెరాస బొటాబొటి మెజారిటీతో గెలిచిందని, దాంతో ప్రభుత్వం పడిపోతుందని కెసిఆర్ మజ్లీస్తో పొత్తు పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు.
తలకాయ నరుక్కుంటా, దళిత నేతను సిఎం చేస్తానని కెసిఆర్ మాట తప్పారని ఆయన అన్నారు. పోలవరంపై రాద్ధాంతం చేయడం కెసిఆర్కు తగదని ఆయన అన్నారు. తెరాస ఎమ్మెల్యేలు తమ పార్టీపై ఎందుకు విరుచుకుపడుతున్నారని ఆయన అడిగారు. ఆంధ్రులను శత్రువుల్లా చూస్తున్నారని, అందుకే హైదరాబాదులో తెరాస చిరునామా లేకుండా పోయిందని ఆయన అన్నారు. తాము సహనంతో వ్యవహరిస్తున్నామని, తెలంగాణ ప్రజలు కూడా బాగుండాలని కోరుకుంటున్నామని, తెలంగాణలో తమ పార్టీ బలపడాలని అనుకుంటున్నామని సోమిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు మానుకోకపోతే పరిణామాలు మరో విధంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.