‘ప్రత్యేక హోదా’ను అందుకే తొలగించారు: సోము వీర్రాజు, జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: ప్రత్యేక హోదా అంశం తెలుగు రాష్ట్రాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు యుద్ధం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Recommended Video

‘ప్రత్యేక హోదా’ అంశాన్ని అందుకే తొలగించారు: సోము వీర్రాజు
ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు వర్చువల్ గా కమిటీ తొలి భేటీ నిర్వహించనుంది. కాగా, ఈ కమిటీ అజెండాలో పలు అంశాలను ప్రస్తావించారు. అందులో ప్రత్యేక హోదా అంశం కూడా చర్చిస్తామని మొదట కేంద్రం ప్రకటన చేసింది. ఇంతలోనే ఎజెండాలో మార్పులు చేసింది కేంద్రం. సమావేశ అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. అధికార పార్టీ నేతలు టీడీపీ, బీజేపీని టార్గెట్ చేశాయి. ప్రత్యేక హోదా అంశం తొలగింపు వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. దీని వెనుక ఎంపీ జీవీఎల్ ప్రమేయం కూడా ఉందంటూ బీజేపీపైనా విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ప్రత్యేక హోదా అంశం ఏపీకి సంబంధించిన అంశం అని, స్పెషల్ స్టేటస్తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని సోమువీర్రాజు వివరణ ఇచ్చారు.

17న ఏపీకి నితిన్ గడ్కరీ.. 23వేల కోట్ల పనులు: సోము వీర్రాజు
కావాలంటే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా ప్రతిపాదన చేస్తే, ఏపీ సర్కారుతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయవచ్చు. అంతేగానీ, తెలంగాణకు ఏం సంబంధం ప్రత్యేక హోదా గురించి. ఆ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొంటున్న సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎలా చర్చిస్తారు?' అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ విధానాలు బాగోలేవని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం భూములు ఇవ్వట్లేదని ఆరోపించారు సోమువీర్రాజు. కాగా, ఫిబ్రవరి 17న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారని, ఆయన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని సోము వీర్రాజు తెలిపారు. ఏపీలో రూ. 23వేల కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వం పనులు చేస్తోందని, ఇప్పటికే కొన్ని చోట్ల పూర్తయ్యాయన్నారు.

పొరపాటుగానే ప్రత్యేక హోదా అంశం: జీవీఎల్ నర్సింహరావు
మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.... కేంద్రం హోంశాఖ సమావేశం అజెండాలో ప్రత్యేకహోదా అంశం పొరపాటున చేర్చారని తెలిపారు. ఫిబ్రవరి 17న జరిగే సమావేశం.. ఏపీ, తెలంగాణ మధ్య విభేదాల పరిష్కారం కోసమేనన్నారు. ప్రత్యేకహోదా అనేది ఉభయ రాష్ట్రాల మధ్య వివాదం కాదన్నారు. అనవసరంగా ప్రత్యేక హోదా అంశాన్ని తెలంగాణ విభేదాలతో ముడిపెట్టొద్దని సూచించారు జీవీఎల్ నర్సింహారావు.

ఏపీకి ఇప్పటికే 75వేల కోట్లు.. వాటిని హోదాగా: జీవీఎల్
అంతేగాక, ప్రత్యేక హోదా వ్యవస్థ ఇప్పుడు లేదని స్పష్టం చేశారు జీవీఎల్ నరసింహారావు. అయినా, ప్రత్యేక హోదా కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవచ్చు అని సూచించారు. కేంద్రం, ఏపీకి పెంచి ఇచ్చిస్తున్న నిధులనే ముద్దుగా ప్రత్యేక హోదా అనుకోండి అని వ్యాఖ్యానించారు. విభజన తర్వాత ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు భర్తీ చేస్తోందన్నారు జీవీఎల్. ఏపీకి కేంద్రం గ్రాంట్ నిధులు మూడు రెట్లు పెరిగి ఇప్పటికే 75 వేల కోట్ల రూపాయలు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీల్లో చదువుకోలేదు.. అయినా, ఆర్థిక రంగంలో దిట్టగా ప్రపంచ వ్యాప్తంగా మన ప్రధానికి గుర్తింపు వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications