అసలు విషయం దాచారు: బాబుపై సోము వీర్రాజు సంచలనం, సీఎం తీరుపై కేంద్రం సీరియస్
అమరావతి: పోలవరం ప్రాజెక్టు అంశం మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కమలం పార్టీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు శుక్రవారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టును నిబద్దతతో పూర్తి చేస్తారనే నమ్మకంతో బాబు చేతుల్లో పెడితే, ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కదారి పట్టిస్తారా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై చంద్రబాబు విమర్శలు ఏమాత్రం సరికాదని విరుచుకుపడ్డారు.

టీడీపీ అసలు విషయాలు దాచింది
కేంద్రం వద్ద టీడీపీ అసలు విషయాలను దాచి పెట్టి, కేవలం సాంకేతికపరమైన అంశాలతో లేఖను రాయడం తగదని సోము వీర్రాజు అన్నారు. కాంట్రాక్టలను మార్చాలన్న ఆలోచన వెనుక దురుద్దేశాలు ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబు వైఖరిపై కేంద్రం సీరియస్గా
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి, సంబంధిత మంత్రులకు చేరవేస్తూనే ఉన్నామని, చంద్రబాబు వైఖరిపై వారు కూడా సీరియస్గానే ఉన్నారని సోము వీర్రాజు తెలిపారు.

కేంద్రం వద్దకు వెళ్లి మాట్లాడేందుకు సిద్ధం
ప్రాజెక్టు నిర్మాణం సమయంలోనే నిర్వాసితుల సమస్య కూడా వచ్చి భారం పెరుగుతోందన్న విషయం తమకు తెలుసునని, ఈ విషయంలో కేంద్రం వద్దకు వెళ్లి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని వీర్రాజు అన్నారు.

వక్రీకరించడం సరికాదు
తాము సానుకూలంగా వ్యవహరించాలని భావిస్తున్నప్పటికీ, తమపై విమర్శలు గుప్పిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు. సోషల్ మీడియాలో, బయట మీడియాలో వక్రీకరించి బీజేపీపై విమర్శలు చేయిస్తుండటం బాధను కలిగిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications