అమిత్ షా మాస్టర్ మైండ్?: బాబుకు గండమే, మారనున్న ఏపీ బీజేపీ స్వరూపం..
వ్యతిరేక వర్గానికి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే..చంద్రబాబుకు కలహాల కాపురం తప్పదు.
విశాఖపట్నం: మాతృ పార్టీ ప్రయోజనాల కన్నా మిత్ర పక్షం లాబీయింగ్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శ వెంకయ్యనాయుడిపై చాలాకాలంగా ఉంది. ఒకవిధంగా ఆయన వల్లే రాష్ట్రంలో పార్టీ ఎదుగదలకు అవకాశం లేకుండా పోయిందనేది పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం అంతర్గత అభిప్రాయం.
ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్న కొంతమంది బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి రహస్య సమాచారం పంపుతూనే ఉన్నారు. సమయం.. సందర్భం కోసం వేచి చూస్తూ వచ్చిన బీజేపీ అధిష్టానం సైతం సరైన సమయంలో వెంకయ్యను 'సైడ్' చేసేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా క్రియాశీలక రాజకీయాలకు ఆయన్ను దూరంగా నెట్టడంతో.. పార్టీ స్వరూపాన్నే మార్చాలనే యోచనలో బీజేపీ ఉంది.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుత విశాఖ బీజేపీ ఎంపీ హరిబాబును కేంద్రంలోకి తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోతే రాష్ట్ర ప్రయోజనాలకు ఒకింత నష్టమే? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో.. అందుకు ప్రత్యామ్నాయంగా హరిబాబును కేంద్రమంత్రిగా నియమించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే గనుక జరిగితే టీడీపీకి చేదు పరిణామమే అని చెప్పాలి. బీజేపీలో హరిబాబు వర్గం మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఉంది. సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు వంటి నేతలు చంద్రబాబుకు వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డారు. ఇప్పుడు హరిబాబును కేంద్రానికి పంపిస్తే.. చంద్రబాబు వ్యతిరేక వర్గానికే అధ్యక్ష పదవి దక్కే అవకాశాలున్నాయి. అలా సోము వీర్రాజుకే అధ్యక్ష పదవి దాదాపు ఖాయమన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
నిజానికి హరిబాబు స్థానంలో వేరొకరిని ఎప్పుడో నియమించి ఉండాల్సింది కానీ వెంకయ్య నాయుడి వల్లే అది ఆలస్యం జరిగిందన్న వాదనలున్నాయి. ఇప్పుడు వెంకయ్యను పక్కకు తప్పించడంతో బీజేపీ ప్రక్షాళన మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు టీడీపీకి మేలు చేకూర్చేలా జరిగిన పార్టీ వ్యవహారాలను ఇప్పుడు పూర్తిగా పార్టీ ఎదుగదలకు దోహద పడేలా అమిత్ షా అండ్ కో వ్యూహ రచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ పరిణామాలు ఒకవిధంగా సీఎం చంద్రబాబుకు గట్టి షాక్ అనే చెప్పాలి. ఆయన వ్యతిరేక వర్గానికి చెందినవారు బీజేపీ అధ్యక్షులుగా ఉంటే.. ఆ పార్టీతో చంద్రబాబుకు కలహాల కాపురం తప్పదు.