మాట తప్పను, మడమ తిప్పననే సీఎం జగన్.. ఆ ప్రోత్సాహకాల మాటేంటి? సోము వీర్రాజు బహిరంగ లేఖ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఇస్తానని చెప్పిన జగన్ సర్కార్, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వడం లేదని సోము వీర్రాజు లేఖలో ప్రశ్నించారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి సోము వీర్రాజు రాసిన బహిరంగ లేఖలో నవమాసాలు నిండినా కూడా మీ ప్రోత్సాహకం అందలేదని మీరు ఇచ్చిన హామీ మేరకు గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులు అందరూ ఏకమై ప్రోత్సాహకాల కోసం ఏకగ్రీవం చేసి గ్రామ సర్పంచ్ లను ఎన్నుకున్నారని పేర్కొన్నారు.
వరదలపై ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ; ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టిన మాజీ సీఎం!!
9నెలలైనా ప్రోత్సాహక నగదు అందలేదన్న సోము వీర్రాజు
9 నెలలు దాటిన ప్రోత్సాహక నగదు అందలేదన్న విషయాన్ని బహిరంగ లేఖ ద్వారా మీకు గుర్తు చేస్తున్నాను అంటూ సోము వీర్రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13,377 పంచాయతీలకు గాను పంచాయితీలను నగర పంచాయతీలుగా మార్చడంతో పాటు ఇతర సమస్యల కారణంగా మొత్తం 13 ,097 గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరి మాసంలో నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈ ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుంటే గతంలో వేలల్లో ఉండే ప్రోత్సాహకాన్ని లక్షల్లోకి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ జనవరి 26 వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేశారని పేర్కొన్నారు.
నగదు ప్రోత్సాహకాల ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలు అయితే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రెండు వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయితే 5 లక్షల రూపాయలు2 రెండు వేల నుంచి ఐదు వేల వరకూ జనాభా వున్న గ్రామపంచాయతీ ఏకగ్రీవం అయితే 10 లక్షలు, ఐదు వేల నుండి పదివేల వరకు జనాభా కలిగిన గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు, పదివేల నుండి ఆపై జనాభా ఉన్న గ్రామపంచాయతీ ఏకగ్రీవమైన 20 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని ఉత్తర్వులలో మీ ప్రభుత్వం పేర్కొందని గుర్తు చేశారు.
2199 పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుంటే నయా పైసా ఇవ్వలేదు
మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2199 పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుంటే ఇప్పటి వరకూ కనీసం నయాపైసా ప్రోత్సాహం కూడా అందించలేదని సోము వీర్రాజు మండిపడ్డారు. మాట తప్పను మడమ తిప్పనని చెప్పే ఏపీ సీఎం జగన్ పంచాయతీలకు ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధి ద్వారా మాత్రమే దేశ అభివృద్ధి జరుగుతుందని అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గమనిస్తే చిత్తశుద్ధి కరువైందని స్పష్టంగా తెలుస్తోందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ప్రోత్సాహకాల కోసం మీరు విడుదల చేసిన ఉత్తర్వులు ఉత్తవి కావని నిరూపించాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. మీరు గ్రామ పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని నమ్మకం రావాలంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ప్రోత్సాహకాలు అందించకుంటే బీజేపీ ఆ పని చేస్తుందని అల్టిమేటం
బిజెపి రాష్ట్ర శాఖ ద్వారా నెల రోజుల గడువు ఇస్తున్నామని ఈ లోగా మీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడానికి సమయంతో కూడిన కార్యాచరణను ఉంచాలని పేర్కొన్న సోము వీర్రాజు, ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించకుంటే బిజెపి ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు.వైసీపీ సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. అదేవిధంగా జిల్లాలోని ఆర్థికవ్యవస్థను కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పరిధిలోకి తీసుకు రావడం వల్ల స్థానిక సంస్థలు బలపడవు సరికదా బలహీన పడుతున్నాయని పేర్కొన్న సోము వీర్రాజు ప్రభుత్వ నిర్ణయం వల్ల గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు వెళ్ళకుండా మీ ప్రభుత్వం మోకాలడ్డుతోంది అంటూ పేర్కొన్నారు.
కేంద్రం గ్రామ పంచాయితీలకు నేరుగా నిధులిస్తే అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం : సోము ఫైర్
ఏ చిన్న పని జరిగినా వాటికి నిధుల చెల్లింపు కష్టతరమవుతుంది అని ఈ విధంగా స్థానిక సంస్థల ఆర్థిక అధికారం మీ గుప్పిట్లో పెట్టుకోవడం దారుణమైన విషయం అని మీకు గుర్తు చేస్తున్నాను అంటూ సోము వీర్రాజు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను గ్రామపంచాయతీలకు వెళ్లకుండా అడ్డుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ లేఖ ద్వారా ఆక్షేపించిందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామాల అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా గ్రామీణులకు నేరుగా అంతిమ ఫలాలు అందడం రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ ద్వారా చెప్పదలుచుకున్నాను అని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
Recommended Video
ఆర్థిక వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగోడగా ఉండటానికి వీల్లేదు
జగన్ సర్కార్ విధానాల వల్ల గ్రామ పంచాయతీల ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందని పేర్కొన్న సోము వీర్రాజు గ్రామ పంచాయతీల ఆర్థిక వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగోడగా వ్యవహరించడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పారు. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించిన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నామని సోము వీర్రాజు పేర్కొన్నారు . ప్రోత్సాహక ఉత్తర్వుల కోసం ఆయా గ్రామాల ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సంగతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరువకుండా ఉంటే మంచిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హితవు పలికారు. ఇప్పటికైనా పంచాయితీలకు ప్రోత్సాహకాలు అందించాలని హితవు పలికారు.