పవన్ ఆప్షన్లు - వీర్రాజు స్పందన : ఇక చంద్రబాబు చేతిలోనే..!!
రాష్ట్రంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ దాదాపు క్లారిటీ ఇచ్చేసారు. ఇక, ఇప్పుడు తేల్చుకోవాల్సింది బీజేపీ - టీడీపీ నాయకత్వమే. మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలనేది అందులో ఒక కీలక ప్రతిపాదన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనాని ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలపైన స్పందించారు. బీజేపీ - జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేసారు. పవన్ చెప్పినట్లుగా ఎవరు తగ్గుతారో.. ఎవరు నిలబడతారో చూడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, టీడీపీని సైతం కలుపుకొని ముందుకెళ్లే అంశం పైన మాత్రం బీజేపీ అధినాయకత్వం స్పష్టత ఇవ్వటం లేదు.

పవన్ తేల్చారు.. బీజేపీ సిద్దం
కుప్పం వేదికగా జనసేనతో పొత్తు అంశం చర్చకు వచ్చిన సమయంలో ఒన్ సైడ్ లవ్వుగా పేర్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు...ఇప్పుడు పవన్ నుంచి స్పందన రావటంతో..పొత్తు దిశగా మరో అడుగు ముందుకు వేస్తారా లేక ... ఇంకా నిరీక్షిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒక విధంగా ఇప్పుడు పొత్తుల అంశం చంద్రబాబు ప్రతిపాదనల మేరకే ఆధారపడి ఉంది. తగ్గాలని అనే పవన్ వ్యాఖ్యల వెనుక అధికారంలో - సీట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత పెరగాలనేదే ప్రధాన అంశంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక, పొత్తుల సంగతి ప్రస్తావిస్తూనే పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలు ప్రకటించటం మరో చర్చకు కారణమైంది. 2024 ఎన్నికలకు సంబంధించిన పలు హామీలను పవన్ కల్యాణ్ ప్రకటించారు.

తేల్చుకోవాల్సింది టీడీపీనే
లక్షల కోట్ల అవినీతిని అరికడితే ఈ హామీల అమలు సాధ్యమే అని తెలిపారు. అవి...అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని అభివృద్ధి అంచెలంచెలుగా జరగాలని కోరుకుంటున్నామన్నారు. అల్పాదాయ వర్గాలకు ఇసుకను ఉచితంగా అందిస్తామని హామీగా ప్రకటించారు. ఉపాధి లేక యువత గంజాయి రవాణా వంటి అక్రమ మార్గాలు, ఆందోళన బాట పట్టకుండా... పది వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసి ఏటా లక్ష మంది యువతకు పెట్టుబడిని అందజేస్తామంటూ ప్రతిపాదించారు. ఇలా ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. ఐదేళ్లలో ఐదు లక్షల మందికి పెట్టుబడి అందిస్తామని ... ఉద్యోగులకు సీపీఎస్ను రద్దు చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు.

మూడు పార్టీల కలయిక కోసం ప్రయత్నాలు
ఇక, పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల పైన ముందుకు కదులుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పటం..ఇప్పుడు పొత్తు ఆప్షన్లు ఓపెన్ గా చెప్పటం ద్వారా ఇప్పుడు వైసీపీ వ్యతిరేక రాజకీయానికి కేంద్ర బిందువుగా మారారు. ఇదే సమయంలో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల కేంద్రంగా భరోసా యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్షాకు శనివారం పవన్ లేఖ రాశారు. ఇక, ఇప్పుడు పవన్ ఆప్షన్ల పైన టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications