'నక్సల్స్కు దమ్ముంటే.. అవినీతి ఎమ్మెల్యేలను కాల్చిపారేయాలి..'
రాజమండ్రి: ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడిస్తుండగానే.. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు నక్సల్స్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
నల్లధనాన్ని అరికట్టే విషయంలో ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ శనివారం నాడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన నక్సల్స్ పై పలు ఆరోపణలతో పాటు కొన్ని సవాళ్లు విసిరారు.
'నక్సలైట్లు.. ఎవరండీ నక్సలైట్లు.. అవినీతంతా అడవిలోనే ఉన్నట్టు అక్కడే ఉండటం ఎందుకు.. దమ్ముంటే జనజీవన స్రవంతిలోకి వచ్చి.. ఓ నలుగురైదుగురు అవినీతి ఎమ్మెల్యేలను కాల్చిపారేయాలి' అని సవాల్ విసిరారు.
అవినీతి అడవుల్లోనే ఉందా?, పేదవాళ్లను చంపేయడానికేనా నక్సల్స్ ఉన్నది? అంటూ ప్రశ్నలు గుప్పించారు సోమువీర్రాజు. కొంతమంది నక్సలైట్లు బెదిరింపుల ద్వారా వచ్చిన డబ్బులను అడవుల్లోని డంపుల్లో దాచేస్తున్నారని సోమువీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు.