ఆస్తి కోసం కొడుకు వేధింపులు: యాసిడ్ తాగిన పేరెంట్స్
హైదరాబాద్: నగరంలోని అల్వాల్లోని జానకీనగర్ దారుణం జరిగింది. ఆస్తి కోసం కుమారుని వేధింపులు భరించలేని తల్లిదండ్రులు యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీబాయి మృతి చెందగా.. తండ్రి రామ్మూర్తి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళితే.. రామ్మూర్తి, లక్ష్మీబాయిలను వారి కుమారుడు దేవానంద్ ఆస్తి కోసం గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. యాసిడ్ తాగాలని కొడుకు దేవానంద్ వారిని వేధింపులకు గురిచేశాడు. అతని వేధింపులు భరించలేక రామ్మూర్తి, లక్ష్మీబాయి దంపతులు యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో లక్ష్మీబాయి మృతి చెందింది. తండ్రి రామ్మూర్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు దేవానంద్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
వ్యాపారిని బెదిరించి దోపిడీ
నగర శివారులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని చైతన్యపురి ప్రాంతానికి చెందిన వ్యాపారి పాండు నల్గొండ జిల్లా చౌటుప్పల్లో స్టీల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి వ్యాపార పనులు ముగించుకుని చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ వాహనంలో పాండు బయల్దేరాడు. హయత్నగర్ మండలం ఇనాంగూడ కూడలి వద్దకు రాగానే డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్క నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించాడు.
వాహనంలో ఉన్నవారు పాండును చితకబాది, తుపాకితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ. 1.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. నగరానికి చేరుకున్న పాండు హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మాచర్లలో దారుణం
గుంటూరు: మాచర్లలో శుక్రవారం ఉదయం దారుణం జరిగింది. మాచర్ల నెహ్రూనగర్లో నివాసం ఉంటున్న సుధాకర్, అతని ఇంటికి సమీపంలో ఉంటోన్న బాబు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బాబు సుధాకర్ ఇంటికి వచ్చి అతడ్ని కత్తి పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత బాబు అదే కత్తితో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.