సోనియా హ్యాపీగానే ఉన్నారు: భేటీ తర్వాత డిఎస్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఫలితాలు ఎదురైనా తమ అధినేత్రి సంతోషంగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సోనియాను కలిసిన అనంతరం ఆయన ఏపీ భవన్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఎంతో కష్టపడి ఆమె పార్టీని ఓ స్థాయికి తీసుకువచ్చారని, పదేళ్లు అధికారంలో ఉంచారని చెప్పారు.
సూక్ష్మస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టలేకపోవడం, పరిష్కరించలేకపోవడంతో తమ ఆ పార్టీకి ఊహించని ఫలితాలు ఎదురయ్యాయని ఆయన వాపోయారు. ఇది తాత్కాలికమేనని, పార్టీ మళ్లీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, తామంతా ఆమె వెనుక ఉన్నామని సోనియాకు చెప్పినట్టు డిఎస్ వివరించారు.
తెలంగాణ ప్రజలు సోనియా పట్ల కృతజ్ఞతాభావంతోనే ఉన్నారని, అయితే ఓట్ల రూపంలో తెలియజేస్తారనుకోవడం తప్పన్నారు. ఆమె ఓట్ల కోసమే తెలంగాణ ఇచ్చినట్టయితే 60 శాతం ఓట్లున్న సీమాంధ్రను ఎలా వదులుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకోలేదని, ప్రజల్లో విశ్వాసం నింపడంలో విఫలమయ్యామని అన్నారు. తన పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ నమ్మించడం తెరాసకు కలిసి వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆర్నెళ్ల ముందు జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని తెలిపారు. కాగా, పోలవరం కోసం ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం న్యాయబద్ధం కాదని, ఇప్పుడే అంత తొందరపడాల్సిన అవసరం లేదని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య మరికొన్ని సమస్యలు ఉంటాయని, ఏదైనా ఎవరికీ నష్టం లేకుండా చేయాలని సూచించారు.