టిపై సోనియా ఒత్తిడి: జివోఎం డైలమా, బిల్లు సాధ్యమా?
న్యూఢిల్లీ: ఇచ్చిన హామీ మేరకు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి ఒత్తిడి వస్తున్నప్పటికీ అది సాధ్యమౌతుందా? అనే చర్చ సాగుతోంది. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అయితే జివోఎం తర్జన భర్జన పడుతోందని, దీంతో బిల్లు సమావేశాల్లో పెట్టడం అనుమానమేనని కూడా కొందరు చెబుతున్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ రేపటి కేబినెట్ సమావేశానికి జివోఎం నివేదిక వచ్చే అవకాశం లేదని, శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టరని చెప్పారు. విభజన అంశానికి సంబంధించి జివోఎం పలు అంశాలపై తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. విభజన - సమస్యల పైన జివోఎంలోనే ఏకాభిప్రాయం కుదరడం లేదనే వాదన వినిపిస్తోంది.

విభజనకు ముందే సీమాంధ్ర ప్రాంతానికి సమన్యాయం చేయాలని జివోఎం సభ్యులు వీరప్ప మొయిలీ, సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్లు పట్టుబడుతుండగా, చిదంబరం మాత్రం విభజన జరిగాక సమస్యలను పరిష్కారం చేయవచ్చునని చెబుతున్నారట.
జివోఎం భేటీ విషయం పైన కూడా సభ్యులు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఇదివరకు జరిగిన జివోఎం భేటీ చివరిదని ఒకరు చెప్పగా, కాకపోవచ్చునని మరో సభ్యులు చెప్పారు. ఈ రోజు దిగ్విజయ్ మాట్లాడుతూ ఇది చివరి సమావేశం కావొచ్చునని తెలిపారు. అయితే సమస్యలు పరిష్కారంపై ఏకాభిప్రాయం లేనందున మరో రెండు జివోఎం భేటీలు జరగవచ్చునని కూడా చెబుతున్నారు.
సమస్యలు
విభజనతో 371(డి), హైదరాబాద్, అప్పులు, ఆస్తులు, రాజ్యాంగ సమస్యలు, న్యాయపరమైన సమస్యలు, నదీ జలాలు, రాష్ట్ర సరిహద్దులు తదితర సమస్యల పరిష్కారానికి జివోఎం సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో సోనియా ఒత్తిడి తెచ్చినప్పటికి రేపటి కేబినెట్ సమావేశానికి రిపోర్ట్ వస్తుందా? శీతాకాల సమావేశంలో బిల్లు వస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
హైదరాబాదుపై తర్జన భర్జన
హైదరాబాదు, తెలంగాణపై ఆంక్షలు లేని హైదరాబాదును తెలంగాణ నేతలు, కేంద్రపాలిత ప్రాంతం కోసం సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదు పైన ఓ క్లారిటీ రాలేదని సమాచారం. వారు ఇంకా ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం అంశాలపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి, యుటి చేసినా ఎలా చేయాలి, ఎన్నాళ్లు చేయాలనే దానితో పాటు యూనియన్ కో ఆర్డినేషన్ కమిటీ పైనా చర్చిస్తోంది. భద్రాచలం విషయంలో మాత్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు డివిజన్లోని 37 గ్రామాలను సీమాంధ్రలో కలపాలని నిర్ణయించుకున్నారు.
మరోవైపు రాయల తెలంగాణ అంశం పూర్తిగా వెనక్కి పోలేదని కూడా అంటున్నారు. దీనిని కూడా జివోఎం పరిశీలిస్తోందని చెబుతున్నారు. టి డ్రాఫ్ట్ను అసెంబ్లీకి పంపిస్తే మూడు వారాల సమయం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇలా ఎన్నో చిక్కుముళ్లున్న నేపథ్యంలో శీతాకాల సమావేశంలోనే బిల్లు రాకపోవచ్చునని, తీసుకువచ్చినా అరకొర సమాచారం మాత్రమే ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications