సీఆర్డీఏకు ఝలక్: అమ్మో అవి వద్దు..! అమరావతిలో ఆ ప్లాట్లకు చిక్కులు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చారు. అయితే దక్షిణ ముఖం కలిగిన ప్లాట్లు వచ్చిన రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది. రాజధానికి మొత్తం 29 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చారు.
పలు గ్రామాల్లో ఈ సమస్య నెలకొందని తెలుస్తోంది. దక్షిణ ముఖం ఉన్న ఇళ్ల స్థలాలను ఈ ప్రాంత ప్రజలు ఇష్టపడరని తెలుస్తోంది. దీంతో ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తిలేక.. అమ్ముకుందామన్నా స్థానికులు కొనడానికి ఆసక్తి చూపించడం లేదట. దీంతో అన్ని ప్లాట్లకు ధరలు పెరుగుతుండగా, దక్షిణ ఫేస్ ఉన్న ప్లాట్ల మాత్రం అడిగేవారు లేరని అంటున్నారు.
అమరావతికి భూములు ఇస్తే నష్టపోయే పరిస్థితి
దీంతో అమరావతికి భూములు ఇచ్చిన తాము నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని దక్షిణ ముఖం ప్లాట్లు ఉన్నవారు వాపోతున్నారు. తమకు ప్లాట్లను మార్చాలని చెప్పినా సీఆర్డీయే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పలుకుబడి కలిగిన వారికి ఇలాగే దక్షిణ ముఖం ఉన్న ప్లాట్లను మార్చిన సీఆర్డీఏ రైతులు, సామాన్యుల విషయంలో చిన్నచూపు చూస్తోందని అంటున్నారు.
మరికొందరికి మూడు ప్రతికూలతలు
అంతేకాదు, కొందరికి ప్లాట్లు మెట్టలో, స్మశానానికి సమీపంలో ప్లాట్లు వచ్చాయి. కొందరికి దక్షిణ ముఖానికి తోడు మెట్ట ప్రాంతంలో స్మశానానికి దగ్గర భూములు రావడంతో వారికి మూడు ప్రతికూలతలు ఉన్నాయని అంటున్నారు.
చంద్రబాబుహామీ ఇచ్చినా, షాకయ్యారు
తమకు వచ్చే రిటర్నబుల్ ప్లాట్లలో కొన్నింటిని అమ్మి, అప్పులు తీర్చుకుందామనో లేదా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిద్దామనో అనుకున్న సదరు రైతులు ఈ పరిణామంతో ఖిన్నులయ్యారు. జరీబు భూములు ఇచ్చిన రైతులకు కూడా ఇలాంటి నష్టం జరిగింది. దీంతో వారు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. జరీబు భూములు ఇచ్చిన వారికి అలాంటి ప్రాంతంలోనే ప్లాట్లు ఇస్తామని, దక్షిణ ముఖం రాకుండా చూస్తామని చంద్రబాబు చెప్పినా ఆ హామీ నెరవేరలేదని అంటున్నారు.
అప్పుడు మాటిచ్చి, ఇప్పుడు ఇలా
భూములు ఇచ్చిన సమయంలో రైతులకు దక్షిణ ముఖం ఉన్న ప్లాట్లు రాకుండా చూస్తామని చెప్పారని, అలాగే ప్లాట్ల కేటాయింపులో పూర్తిగా రైతుల ఇష్టానుసారమే ఇస్తామని సీఆర్డీఏ చెప్పిందని, కానీ ఇప్పుడు మాత్రం అలా వ్యవహరించడం లేదని వాపోతున్నారట. ప్లాట్లపై అభ్యంతరాలు ఉంటే పదిహేను రోజుల్లో సరి చేస్తామని అధికారులు చెప్పారని, కానీ అది కూడా అమలు కావడం లేదని వాపోతున్నారట. సౌత్ పేస్పై ఎవరికి చెప్పినా తమ గోడు వినడం లేదని వాపోతున్నారని తెలుస్తోంది. తమ సమస్యకు సీఆర్డీఏ పరిష్కారం చూపాలని కోరుతున్నారు.