ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ కు ఛాన్స్- ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. ఇవే పరిస్థితులు ఈ వారం కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేసింది.
దీనికి కారణం- బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం. ఈ నెల 17వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది మరింత తీవ్రరూపం దాల్చింది. గురువారం నాటికి దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం ఈ అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. రాబోయే 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని, నైరుతి- దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ వాయుగుండం ప్రభావం ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అతి భారీ వర్షానికి తిరుమల జలమయమైంది. భక్తులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ తలదాచుకున్నారు. ఆగకుండా వర్షం కారణంగా ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. ఈ తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి.
పరిస్థితి తీవ్రత నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని సూచించారు. అన్నమయ్య రాయచోటి, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, తీవ్ర వాయుగుండం ఏర్పడిన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, ఇప్పటికే సముద్రం మీదికి వెళ్లిన వాళ్లు తిరిగి రావాలని సూచించారు.
తీర ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, ఇళ్లు, ఇతర భవనాల కింద నిల్చోకూడదని ప్రఖర్ జైన్ సూచించారు.












Click it and Unblock the Notifications