ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక!
పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాలకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా ఉత్తర ఒడిసా, జార్ఖండ్ రాష్ట్రాలమీదగా పయనించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావంతోనే గడిచిన 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు కురిశాయి.
అల్పపీడనానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం పశ్చిమ బెంగాల్, ఒడిసా తీరాల వరకు విస్తరించింది. ఏపీపై దీని ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటంతో 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. అల్ప పీడన ప్రభావంవల్ల సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. మన్యం, కోనసీమ, కాకినాడ, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో 20 జిల్లాల్లో సగటు వర్షపాతం నమోదవలేదు. నాలుగు జిల్లాల్లో సాధారణ వర్షపాతం, రెండు జిల్లాల్లోనే అధిక వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో, అత్యధికంగా బాపట్ల జిల్లాలో వర్షాలు కురిశాయి. వారం రోజుల క్రితం వరకు ఎండలు, వేడిగాలులతో ఇబ్బందిపడిన ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించాయి.












Click it and Unblock the Notifications