పాయింట్ 32 గన్తో కాల్పులు, అనురాధ కంటిలోకీ ఛాతీలోకీ బుల్లెట్లు: ఎస్పీ
చిత్తూరు: మేయర్ కటారి అనురాధా హత్య కేసులో హంతకులు ఎంతటివారైనా వదలిపెట్టేది లేదని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. పాయింట్ 32 గన్తో దుండగులు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. అతి సమీపం నుంచి కాల్పులు, కత్తులతో దాడి చేశారని అన్నారు. మేయర్ అనురాధ కన్ను, ఛాతిలో బుల్లెట్లు దిగినట్లు ఎస్పీ శ్రీనివాస్ వివరించారు.
తెలుగుదేశం పార్టీ చిత్తూరు మేయర్ కటారి అనురాధ దారుణ హత్య నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హత్య విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కార్పొరేషన్ ఆఫీసుకు భారీగా చేరుకుంటున్నారు.
మరోవైపు హోంమంత్రి చినరాజప్ప, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరుకు బయలుదేరారు. మంగళవారం కార్పొరేషన్ ఆఫీసులో ఉన్న కటారి అనురాధ, ఆమె భర్తపై దుండగులు కత్తులు, తుపాకీలతో దాడి చేయడంతో అనురాధ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో వేలూరు సీఎంసీకి తరలించారు.
పోలీసు జాగిలాలు సంఘటనా స్థలం నుంచి బయలుదేరి అనురాధ భర్త మోహన్ మేనల్లుడు చింటూ ఇంటి వద్ద ఆగాయి. చింటూ పాత్రపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనురాధ హత్య జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.