ఏపీలో మరో ఐఎఎస్ రాజీనామా
Chandrababu Naidu: చంద్రబాబు ప్రభుత్వంలో మరో వికెట్ పడింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కరికాల వలవన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్కు పంపించారు. వెంటనే రిలీవ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించినట్లు తెలుస్తోంది.
1989 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన అధికారి.. కరికాల వలవన్. ఆయన స్వరాష్ట్రం తమిళనాడు. వివాదరహితుడిగా పేరుంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి అలాట్ అయ్యారు. 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మున్సిపల్ పరిపాలన సహా కీలక శాఖల్లో పని చేశారు.

ఆ తరువాత ఏర్పడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కూడా ఆయనకు అదే స్థాయి ప్రాధాన్యత ఇచ్చింది. 2023 జులైలో కరికాల వలవన్ పదవీ విరమణ చేశారు. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. ఆయనను రిలీవ్ చేయలేదు అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆయన ప్రతిభను దృష్టిలో ఉంచుకుని సర్వీసును పొడిగించింది.
ఏడాది పాటు అంటే ఈ సంవత్సరం జులై 31వ తేదీ వరకు పొడిగించింది. దేవాదాయ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలోనే కొనసాగించింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కరికాల వలవన్.. తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలం జులై 31వ తేదీ వరకు ఉన్నప్పటికీ.. తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కమిషనర్గా పని చేశారాయన. అప్పట్లో ఆయన హయాంలోనే రోడ్ల వెడల్పు జరిగింది. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా రోడ్లను విస్తరించడంలో సక్సెస్ అయ్యారు కరికాల వలవన్.












Click it and Unblock the Notifications