ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో షాక్-రెండు వారాల రిమాండ్ పొడిగింపు-బెయిల్ పై రేపు నిర్ణయం
ఏపీలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక ప్రత్యేక కోర్టు ఇవాళ షాకిచ్చింది. డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబుకు గతంలో విధించిన రెండు వారాల రిమాండ్ పూర్తి కావడంతో ఇవాళ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు మరో రెండువారాల రిమాండ్ విధించింది.
డ్రైవర్ హత్య కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఇఫ్పటివరకూ కస్టడీలోకి తీసుకోలేదు. చిన్నాచితకా నేరాల్లో సైతం నిందితుల్ని కస్టడీ కోరే పోలీసులు అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీని ఇప్పటివరకూ కస్టడీ కోరకపోవడం చర్చనీయాంశమవుతోంది.ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కు కూడా పిటిషన్ వేశారు. అయితే ఆయన బెయిల్ పై రేపు విచారణ చేస్తామని ప్రకటించిన కోర్టు.. ఆయన రిమాండ్ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
కాకినాడలో అనుమానాస్పద స్ధితిలో డ్రైవర్ సుబ్రమణ్యం మృతదేహాన్ని అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ అనంతబాబు.. ఆ తర్వాత పెళ్లిళ్లలో కూడా దర్శనమిచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల తర్వాత ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ హత్యలో ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు కూడా వచ్చారు. అయినా ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించలేదు. ఇదే అదనుగా ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.