తిరుమల శ్రీవారి వద్ద నూతన దంపతులకు బంపర్ ఆఫర్
విశాఖపట్నం: నూతన దంపతులకు తిరుమలలో విఐపి దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ విషయం చెప్పారు. తిరుపతిలో పర్యాటక రంగాన్ని విస్తృత పరచడానికి ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన తెలిపారు.
పర్యాటకాభివృద్ధిపై సీఐఐ విశాఖ చాప్టర్ మంగళవారం పార్కు హోటల్లో నిర్వహిం చిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎక్కువ మంది వారి పిల్లలకు తిరుపతిలో వివాహం జరిపించాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి వారి కోసం తిరుపతిలో వివాహవేదిక నిర్మించాలని ప్రతిపాదించామన్నారు.
వివాహం తర్వాత కొత్త దంపతులు, ఇరువైపుల తల్లిదండ్రులు మొత్తం ఆరుగురికి తిరుమలలో వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలలో పొందుపరుస్తున్నామని చెప్పారు. దీనికోసం త్వరలో తిరుపతిలో టూర్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం చేయడంతోపాటు వివిధ వర్గాలను భాగస్వాములను చేస్తామన్నారు.
దీనికి ప్రాంతాలవారీగా టూరిజం ప్రమోషన్ బ్యూరోలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తొలుత విశాఖపట్నం నుంచే ప్రమోషన్ బ్యూరోలు ప్రారంభిస్తామన్నారు. నెల్లూరు, తిరుపతి, అనంతపురం ఇలా ప్రతీ నోడ్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక స్థలాలను కలుపుతూ అభివృద్ధి సాగిస్తామన్నారు. పర్యాటక విస్తరణలో భాగంగా అన్ని దేశాల నుంచి ఎయిర్ కనెక్టివిటీని మరింత పెంచుతామని చెప్పారు.