జగన్కు ఈడీ కోర్టు ఝలక్- సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ విచారణ- గ్రీన్సిగ్నల్
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్కు ఇవాళ ఊరట దక్కలేదు. తనపై గతంలో సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో విచారణతో పాటే ఈడీ కేసుల విచారణ కూడా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్ధనను హైదరాబాద్లోని ప్రత్యేక న్యాయస్ధానం తోసిపుచ్చింది.
వైసీపీ అధినేతగా ఉన్న జగన్పై 2010లోనే సీబీఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. అయితే ఇందులో విచారణ నత్తనడకన సాగుతోంది. పదేళ్ల తర్వాత కూడా విచారణ పూర్తి కాలేదు. దీంతోపాటు మనీలాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసులు నమోదు చేసింది. ఈ రెండు కేసులను విడివిడిగా విచారించడం వల్ల ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్కు హాజరు కావడం కష్టమని, సమయం కూడా వృథా అవుతుందని జగన్ తరఫు న్యాయవాదులు హైదరాబాద్లోని ఈడీ ప్రత్యేక కోర్టు దృష్టికి తెచ్చారు.

అయితే సీబీఐ నమోదు చేసిన కేసులకూ, ఈడీ నమోదు చేసిన కేసులకూ సంబంధం లేదని, ఈ రెండు వ్యవహారాల్లో వేర్వేరు దర్యాప్తు, విచారణ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. దీంతో సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ విచారణ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఈడీ కేసులను ముందుగానే విచారణ జరుపుతామని ప్రకటించింది. దీనిపై దాఖలైన పిటిషన్ను ఈ నెల 21కి వాయిదా వేసింది. దీంతో సీబీఐ కేసుల కంటే ముందే ఈడీ కోర్టులో కేసుల విచారణ సాగే అవకాశముంది.












Click it and Unblock the Notifications