కేవీపీ బిల్లు ఎఫెక్ట్: ఏ స్టెప్ ఐనా.. బీజేపీని కార్నర్ చేస్తున్న టిడిపి
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు హుళక్కే అని భావిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక హోదా పైన టిడిపి కూడా లోకసభలో నోటీసు ఇచ్చింది.
హోదా అంశం ఓ వైపు బీజేపీని, మరోవైపు టిడిపిని చిక్కుల్లో పెట్టే అంశం. హోదా పైన చర్చ జరిగి, ఓటింగ్ జరిగితే టిడిపి కచ్చితంగా మద్దతివ్వాల్సిందే. ఇక, బీజేపీ ప్రత్యేక హోదా గురించి హామీ ఇచ్చిన పార్టీ. 2019 వరకు హోదా ఇవ్వకుంటే బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పక మానరని అంటున్నారు.
ఓవైపు ప్రత్యేక హోదాపై వెనక్కి పోతున్న బీజేపీ, మరోవైపు ఏపీ ప్రయోజనాల కోసం కేవీపీ బిల్లుకు మద్దతివ్వాల్సిన పరిస్థితి.. ఓ వైపు మిత్రపక్షం, మరోవైపు ఏపీ ప్రజల దృష్టిలో దోషిగా మిగలకూడదని టిడిపి భావిస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి వ్యూహాత్మక వైఖరి అవలంభిస్తోంది.

కేవీపీ బిల్లు చర్చకు వచ్చినా రాకున్నా, ప్రత్యేక హోదా విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడబోమని టిడిపి ప్రజలకు చెప్పాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టిడిపి నేతలు బీజేపీ పైన మాటలు విడుస్తున్నారు. ఓ వైపు విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ.. హామీలు నెరవేర్చే బాధ్యత బీజేపీ పైన ఉందని చెబుతున్నారు. చంద్రబాబు కూడా తన అసహనం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్లో ప్రత్యేక హోదా గురించి పదేపదే మాట్లాడుతున్నారు. బీజేపీతో పొత్తు నేపథ్యంలో నిత్యం ఆచితూచి స్పందించే సుజన కూడా బుధవారం ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ మిత్రధర్మం పాటిస్తుందో లేదో చెప్పాలని సుజనా చౌదరి నిలదీశారు. అంతేకాదు, రాష్ట్ర ప్రయోజనాలకు ఏ స్టెప్ తీసుకోవాలో ఆ సమయం వచ్చినప్పుడు ఆ స్టెప్ కచ్చితంగా తీసుకుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తద్వారా ఏపీ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. టీజీ వెంకటేష్ కూడా ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications