పవన్ ఎఫెక్ట్: ఏపీపై వెంకయ్య-సుజన ఒత్తిడి, మెత్తబడ్డ జైట్లీ, బాబు ఆదేశాలే..
న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభ ప్రభావమో, మరేమో కానీ మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర హామీల అంశంపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. మంగళవారం నాడు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గంటన్నర పాటు చర్చలు జరిపారు.
జైట్లీపై వెంకయ్య, సుజన ఒత్తిడి
పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా అంశంపై ఏదో ఒకటి తేల్చాలని, దీనిపై తక్షణం నిర్ణయం తీసుకోకుంటే మన పార్టీలు (టిడిపి, బిజెపి) తీవ్రంగా నష్టపోక తప్పదని ఓ వైపు వెంకయ్య, మరోవైపు సుజనలు.. జైట్లీ పైన ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది.

ఈ భేటీ జైట్లీ నివాసంలో జరిగినందని తెలుస్తోంది. ముగ్గురు కేంద్రమంత్రులు, అమిత్ షా కలిసి ఏపీకి ఏం చేయాలన్న అంశంపై గంటకు పైగా చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక రైల్వే జోన్ తదితర అంశాలపై చర్చించారు.
జైట్లీతో విడిగా సుజన భేటీ
జైట్లీతో టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి విడిగా సమావేశమయ్యారు. హోదా ప్రకటించకుంటే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత విషయమై చెప్పారు. అంతకుముందు సుజన వ్యాఖ్యలకు వెంకయ్య కూడా జత కలిశారని తెలుస్తోంది.
ముసాయిదా తయారైంది: సుజనా చౌదరి
భేటీ అనంతరం సుజనా మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఏం చేయాలన్న విషయమై కేంద్రం ముసాయిదా తయారైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తాము జరిపిన సంప్రదింపులు ఫలవంత మయ్యాయన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ప్రకటన వెలువడుతుందన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే జైట్లీ, షా, వెంకయ్యలతో చర్చించామన్నారు. త్వరలో నిర్ణయం వస్తుందన్నారు.
ఓ వైపు వెంకయ్య, మరోవైపు సుజనలు ఏపీలో నెలకొన్న సెంటిమెంట్ గురించి చెప్పగా.. జైట్లీ కూడా మెత్తబడినట్లుగా తెలుస్తోంది. జైట్లీ మెత్తబడిన నేపథ్యంలో ఏపీకి సానుకూల కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications