హోదాపై సుజన ట్విస్ట్: ఆసుపత్రిలో దీక్ష చేస్తా: శివాజీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి ట్విస్ట్ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వెనుకడుగు వేయలేదని బుధవారం చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద జేఏసీ నాయకులు సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ వాహనాలను అడ్డుకున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడాలని డిమాండు చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుజన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం తాము కష్టపడుతూనే ఉన్నామన్నారు. తాము తమ ప్రయత్నాలు ఆపలేదన్నారు. కేంద్రం వెనక్కి తగ్గలేదన్నారు.
చంద్రబాబుపై ధ్వజమెత్తిన రఘువీరా రెడ్డి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లాలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాప్తాడులో హత్యను చూస్తుంటే ప్రభుత్వమే దగ్గరుండి హత్యలకు పాల్పడుతున్నట్లుగా ఉందన్నారు. నవ్యాంధ్రను నేరాంధ్ర, హత్యాంధ్రగా మార్చారని ఆరోపించారు.
రాజకీయ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. నిబద్ధతతో పనిచేసే పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, ప్రాణహాని ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో చంద్రబాబుకు సీఎం స్థాయి భద్రత కల్పించామన్నారు. రాప్తాడులో భూముల ధరలు భారీగా పెరిగాయని, ల్యాండ్ మాఫియా రికార్డులను తగలబెట్టిందన్నారు.
నాలుగో రోజుకు శివాజీ దీక్ష
ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో శివాజీ దీక్ష బుధవారం నాలుగు రోజుకు చేరుకుంది. ఆయన బాగా నీరసించిపోయారు. దీక్ష విరమించాలని పోలీసులు చేసిన వినతిని ఆయన తిరస్కరించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు దీక్ష విరమించనని చెప్పారు. ఆరోగ్యం క్షీణించినా, దీక్ష విరమించబోనని చెప్పారు. వైద్య పరీక్షల్లో శివాజీ నీరసించినట్లు నిర్ధారించారు.
శివాజీ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో కొనసాగిస్తానని ప్రకటన
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే వరకు తాను ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని శివాజీ ప్రకటించారు. శివాజీ దీక్షను భగ్నం చేసి గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీక్ష భగ్నంతో ఉద్యమం ఆగదని, ప్రజలు శివాజీ పక్షాన ఉన్నారని కారె శివాజీ అన్నారు.