వెంకయ్యకు చిక్కులు: జగన్ తక్కువే, ఇతర పార్టీలే ఎక్కువ
హైదరాబాద్: కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తీవ్రమైన చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విపక్షాలు ఆయనపై విరుచుకుపడేందుకు కాచుకుని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఆయనపై ఇప్పటికే విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆ విమర్శల దాడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఎపికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి యుపిఎ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఎపికి ప్రత్యేక హోదాపై పట్టుబడుతూ బిజెపి రాజ్యసభలో విభజన బిల్లును అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అప్పటి బిజెపి రాజ్యసభ సభ్యుడు, ఇప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కీలక భూమిక పోషించారు. అంతేకాకుండా, ఎపికి ఐదేళ్లు కాకుండా పదేళ్లు ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన రాజ్యసభలో పట్టుబట్టారు. దీని కోసం ఆయన రాజ్యసభలో హోరాహోరీగానే పోరాటం చేశారు. దాంతో యుపిఎ ప్రభుత్వం అందుకు అంగీకరించింది. అయితే, విభజన విషయంలో యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డియె ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తోంది.
వాటిని అమలు చేయించాల్సిన భారాన్ని వెంకయ్య నాయుడు మోయాల్సిన పరిస్థితిలో పడ్డారు. విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన సమయంలో ఆయన నిర్వహించిన బాధ్యతనే ఆయనపై ఆ భారాన్ని మోపింది. అయితే, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం పలు చిక్కులను ఎదుర్కుంటోంది. ఎపికి ప్రత్యేక హోదా కల్పిస్తే తమకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని తమిళనాడు, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలనే ఆలోచనను దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అన్ని రాష్ట్రాలను ఒప్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం అంటోంది.
ప్రత్యేక హోదా కష్టమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మంత్రులతో చెప్పేశారు. బిజెపితో సత్సంబంధాలు కోరుకుంటున్న చంద్రబాబు దానికోసం కేంద్రంతో ఘర్షణ పడే స్థితిలో లేరు. ఆ విషయంలో ఘర్షణ పడితే ఇప్పటికే ఆర్తికంగా చిక్కులను ఎదుర్కుంటున్న రాష్ట్రం మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉందనేది కూడా ఆయన వెనక్కు తగ్గడానికి మరో కారణం. ప్రత్యేక హోదాను వదిలేసి ఇతరత్రా ఆర్థిక ప్యాకేజీలను రాబట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇదే దిశలో వెంకయ్య నాయుడు ఆలోచన చేస్తున్నారు. ఇందుకు విభజన బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరమని కూడా వెంకయ్య నాయుడు అంటున్నారు.
ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండగానే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ ఎక్కువ దాడిని వెంకయ్య నాయుడిపై పెట్టినట్లు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మాత్రం బిజెపిపై తక్కువగా, చంద్రబాబుపై ఎక్కువగా విరుచుకుపడుతున్నారు. బిజెపితో వైయస్ జగన్ సత్సంబంధాలను కోరుకుంటుండడమే అందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఈ విషయంపై వెంకయ్య నాయుడి మీద కూడా విమర్శలు సంధిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా వెంకయ్య నాయుడిపై ఈ అంశం మీద విమర్శలు చేశారు. కాంగ్రెసు నుంచి వెంకయ్య నాయుడు ఎక్కువగా విమర్శలు ఎదుర్కునే అవకాశం ఉంది. తిరిగి ఆంద్రప్రదేశ్లో జీవం పోసుకోవడానికి కాంగ్రెసుకు ఇది మంచి అవకాశంగా కనిపిస్తోంది. జగన్ తీవ్ర స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో ఉన్నందున ఇది కాంగ్రెసుకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
కాగా, కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విషయంలో ఇప్పటికే బిజెపిపై విమర్శలు చేశారు. తాజాగా, మరో కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ వెంకయ్య నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యను జోకర్కి ఎక్కువ, బఫూన్కి తక్కువ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించిందని ఉండవల్లి అరుణ్కుమార్ విమర్శించారు. అప్పుడు ప్రతిపక్షలో ఉన్న బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని అయినా ఏపీకి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, టిడిపి సంకీర్ణ ప్రభుత్వం సాగుతున్న తరుణంలో అటు బిజెపినీ, వెంకయ్య నాయుడిని మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడిని కూడా కాంగ్రెసు పార్టీ తప్పు పడుతోంది. చంద్రబాబుపై కాంగ్రెసు పార్టీ నాయకులతో పాటు హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, చంద్రబాబుకు ఇబ్బంది రాకుండా ప్రత్యేక హోదా సమస్యను పరష్కరించే బాధ్యత కూడా వెంకయ్య నాయుడే మోయాల్సిన పరిస్థితిలో పడ్డారు. ప్రత్యేక హోదా సమస్య నుంచి తాను మాత్రమే కాకుండా చంద్రబాబును కూడా ఎలా బయటపడేస్తారనేది వేచి చూడాల్సింది.