శివాజీ-జగన్ పోరాటమా? పవన్ కళ్యాణ్ విశ్వాసమా?: బిజెపి-టిడిపికి చిక్కే
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మరోసారి ఉద్యమం రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక దీక్షకు సిద్ధం కాగా, మరోసారి నటుడు శివాజీ హోదా పైన కేంద్రమంత్రులకు ఘాటైన హెచ్చరిక చేశారు.
ప్రత్యేక హోదా కోసం నటుడు శివాజీ తొలి నుంచి పోరాడుతున్నారు. ఆయన అంతకుముందు బిజెపిలో చేరారు. ఆ పార్టీలో ఉన్నప్పటికీ... హోదా విషయంలో మాత్రం పార్టీ పైనే దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే బిజెపిని ఎవరూ నమ్మరని అల్టిమేటం జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
కొద్ది రోజుల పాటు శివాజీ మౌనంగా ఉన్నట్లుగా కనిపించింది. మరోసారి, ప్రత్యేక హోదా పైన గళమెత్తారు. రాజధాని శంకుస్థాపన తర్వాత ప్రత్యేక హోదా పైన ప్రకటన వెలువడాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర ఉద్యమం ఉంటుందని హెచ్చరించారు.
మరోవైపు, వైయస్ జగన్ హోదా కోసం నిరవధిక దీక్షకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 7న గుంటూరు జిల్లాలోని నల్లపాడులో దీక్ష చేయాలని నిర్ణయించారు. హోదా పైన తనకు మద్దతు కోసం ఆయన ఇటీవలి వరకు విద్యార్థులను కూడగట్టే ప్రయత్నం చేశారు.
తద్వారా తనకు, ప్రత్యేక హోదాకు వారి మద్దతును అడిగారు. విశ్వవిద్యాలయ విద్యార్థులతోను భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ఉద్యమంలో విద్యార్థులు పాల్గొంటే.. జగన్కు రాజకీయ లబ్ధితో పాటు.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి కూడా ఉంటుందని చెప్పవచ్చు.
మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా కోసం కేంద్రం వద్ద ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హోదా పైన పెదవి విప్పాలని పలుమార్లు డిమాండ్ వచ్చింది.
అయితే, ఆయన బిజెపి పైన, ప్రధాని మోడీ పైన నమ్మకంతో ఉన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటారని ఆయన భావిస్తున్నారు. పవన్ అభిప్రాయమే చాలామందిలో ఉంది. బీహార్ ఎన్నికల అనంతరం.. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో స్పష్టత ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.
ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతుందని, హోదా లేకుండా కేవలం ప్యాకేజీ అంటే మిగతా రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి కనిపించదని విపక్షాలు, పలు ప్రజా సంఘాలు చెబుతున్నాయి. బిజెపి హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై బీహార్ ఎన్నికల తర్వాత కూడా స్పష్టమైన ప్రకటన రాకుంటే.. టిడిపి - బిజెపికి చిక్కులు తప్పేలా లేవంటున్నారు.