హోదా రగడ: కెవిపి బిల్లుపై కుట్ర అంటూ దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ/ కర్నూలు/ చెన్నై: ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బిజెపి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ పార్టీ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు రాకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఆ బిల్లుపై చర్చ జరగకుండా రాజ్యసభను వాయిదా వేయాలని కేంద్రం చూస్తోందని ఆయన అన్నారు. గురువారంనాడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై మన్మోహన్ సింగ్ మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేకంగా దీనిపై చట్టం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత కాంగ్రెసు పార్టీకి లేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి, బిజెపి నేత మాణిక్యాలరావు అన్నారు. ఆయన గురువారంనాడు చెన్నైలో మీడియాతో మాట్లాడారు . ప్రత్యేక హోదాపై చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఆర్థికంగా సహకరిస్తుందని ఆయన చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదాపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కెవిపి రామచందర్ రావు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. అది రేపు శుక్రవారం రాజ్యసభలో చర్చకు రావాల్సి ఉంది. అయితే, ఈలోగానే రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తారనే ప్రచారం సాగుతోంది.
పార్టీల మద్దతు: జైరామ్, కేవీపీ
ప్రత్యేక హోదా పైన కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లుకు జేడీయు, సమాజ్వాది పార్టీ మద్దతిచ్చాయని జైరామ్ రమేష్ అన్నారు. బిల్లు చర్చకు రాకుండా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
అడ్డుపడుతున్నారని చెప్పారు. నిరవధిక వాయిదా ద్వారా బీజేపీది పారిపోయే ప్రయత్నమన్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని కేవీపీ రామచంద్ర రావు అన్నరు. ఏపీ ప్రయోజనాలు కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలన్నారు. ఏపీని సమైక్యంగా ఉంచేందుకు తాము చాలా కృషి చేశామని చెప్పారు.
ఇప్పుడు కాకున్నా వచ్చే వర్షాకాలం సమావేశంలో అయినా బిల్లు పాస్ అవుతుందని, ఆంధ్రుల ప్రయోజనం కోసం ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పోరాడుతామని చెప్పారు. ప్రయివేటు బిల్లుతో హోదాకు జాతీయ ప్రాధాన్యత వచ్చిందని చెప్పారు.












Click it and Unblock the Notifications