పాలన: రద్దైన టీటీడీ స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) పాలక మండలి రద్దు కావడంతో మండలి స్థానంలో తాజాగా స్పెసిఫైడ్ అథారిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈమేరకు జీవో 544ను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాలకు గత ప్రభుత్వం నియమించిన పాలక మండళ్లను (తితిదే సహా) రద్దు చేస్తూ ఈనెల 9న ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
దాంతో అతిముఖ్యమైన టిటిడి పాలన సజావుగా సాగేందుకు స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. అథారిటికీ చైర్మన్గా రెవెన్యూ (దేవాదాయ) శాఖ ముఖ్య కార్యదర్శి (ప్రస్తుతం జెసి శర్మ పని చేస్తున్నారు) వ్యవహరిస్తారు.
టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారి (ఇఓ) అథారిటీలో కీలక పాత్ర పోషిస్తారు. టిటిడి పాలక మండలి చేపట్టే కార్యక్రమాలు అన్నింటినీ ఇకనుంచి స్పెసిఫైడ్ అథారిటీ నిర్వర్తిస్తుంది. కాగా, 2014 ఫిబ్రవరి 11న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది.
దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి చైర్మన్గా, దేవాదాయ శాఖ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా మరికొంత మందిని సభ్యులుగా నియమిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కావడంతో పాత నియామకాన్ని రద్దు చేశారు. త్వరలోనే కొత్తగా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.