విమానంలో రోజా సహా వైసిపి ఎమ్మెల్యేలు: లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తున్న విమానంలో సోమవారం నాడు ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. విమానం బయలుదేరిన కాసేపటికే తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా అది తిరిగి ల్యాండ్ అయింది.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపంతో వెనుదిరిగింది. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఈ విమానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, మరికొందరు ముఖ్యనేతలు ఉన్నారని తెలుస్తోంది. విమానంలో ఎమ్మెల్యే రోజా, వైసిపి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు చాలామంది ఉన్నారు. కాగా వారు మరో విమానంలో ఢిల్లీ వెళ్లారు.
జొన్నాడలో ప్రమాదం, చినరాజప్ప విచారం
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఒక ఇన్నోవా కారు పంట కాలువలోకి దూసుకెళ్లి ముగ్గురు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పైన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.
పోలీసులు వేధిస్తున్నారని టవరెక్కిన యువతి
పోలీసులు విచారణ పేరుతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువతి సెల్ టవర్ ఎక్కింది. తణుకు పట్టణం సజ్జాపురం ప్రాంతానికి చెందిన కాళిదాసు నాగప్రసాద్కు ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.
ఆమెతో కలిసి అతను ఎక్కడికో వెళ్లిపోయాడు. సదరు యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాగప్రసాద్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. అకారణంగా తమను పిలిపించి, వేధిస్తున్నారని నాగప్రసాద్ సోదరి మీనా సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సెల్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలిపింది. అందరు సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.