అమరావతిలో 'స్ఫూర్తి భవన్' పేరిట అతి పెద్ద మ్యూజియం: చంద్రబాబు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్ఫూర్తి భవన్ నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం శాసనసభలో అంబేద్కర్ జయంత్యుత్సవాలపై జరిగిన చర్చలో ఒక ప్రశ్నకు చంద్రబాబు బదులిచ్చారు.
దేశానికి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన సేవలను వివరిస్తూ అతి పెద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రతి జిల్లాలో అంబేద్కర్ భవనాలు నిర్మిస్తామని, ఏడాది పొడవునా అంబేద్కర్ జయంతిపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది జరిగే అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ప్రజలకు స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇస్తామని, బడుగు, బలహీనవర్గాలకు అంబేద్కర్వల్లే న్యాయం జరిగిందని చెప్పారు. వచ్చేరోజుల్లో సమాజంలో ఆర్ధిక అసమానతలను తొలగించాలని భావిస్తున్నామని, అంబేద్కర్పై పాఠ్యగ్రంథాల్లో పాఠ్యాంశాలను చేరుస్తామన్నారు.
అంబేద్కర్పై అవగాహన కలిగించడంతో ప్రజా చైతన్యం తెస్తామన్నారు. ఆనాడే అంబేద్కర్ భారతీయ సామాజిక వ్యవస్థకు గట్టి పునాది వేశారని, వివిధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ ఘనతను పలువురు ఎమ్మెల్యేలు కొనియాడారు. ఎన్నో సంక్షోభాల నుంచి అంబేద్కర్ విజయాలను అందుకున్నారని అన్నారు. అంబేద్కర్ను ఒక వర్గానికే పరిమితం చేయడం సబబుకాదని, భారతీయులందరికీ సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు.
ఓసీల్లోనూ పేదలున్నారని, వారందరికీ కొంత నిధి ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గానికి నాలుగు లక్షలిస్తే అంబేద్కర్ విగ్రహాల నిర్మాణం చేపట్టవచ్చని ఎమ్మెల్యేలు సూచించారు. విపక్ష నేతకు అంబేద్కర్ గురించి తెలియకనే సభ నుంచి వెళ్లిపోయారని పలువురు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications