పరువు తీశారు!: పరిటాల శ్రీరామ్, జేసీ పవన్ 'స్పోర్ట్స్ స్కామ్'?, వెలుగుచూసిన బాగోతం
జేసీ పవన్ క్రీడా నిధులు దుర్వినియోగం చేశారని ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం ఆరోపించారు.
Recommended Video
అనంతపురం: రాజకీయ పలుకుబడితో క్రీడా రంగాన్ని శాసిస్తున్న బడాబాబుల వారసులు ఆ రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న పరిటాల శ్రీరామ్ ఈ వివాదంలో ఇరుక్కోగా.. తాజాగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా ఇదే వివాదంలో ఇరుక్కున్నారు.
రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలు కావడంతో.. క్రీడా అసోసియేషన్లలో చోటు సంపాదించిన వీరు.. నకిలీ సర్టిఫికెట్లను ఇష్యూ చేయడం, ఒలింపిక్ అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
పరిటాల శ్రీరాంపై ఆరోపణలు:
కనీసం మ్యాచ్ కోర్టులోకి కూడా అడుగుపెట్టని వ్యక్తులకు క్రీడా సర్టిఫికెట్లు ఇష్యూ చేసి క్రీడా రంగం పరువు తీస్తున్నారన్న ఆరోపణలు పరిటాల శ్రీరాంపై ఉన్నాయి. బడా కుటుంబాలకు చెందినవారెవరైనా సర్టిఫికెట్ల కోసం సంప్రదిస్తే.. డబ్బులు దండుకుని వారికి సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నట్లుగా పరిటాల శ్రీరామ్ పై ఆరోపణలు వస్తున్నాయి.
శ్రీరామ్ అనుచరులు:
పరిటాల శ్రీరామ్ అనుచరులైన సాఫ్ట్ బాల్, ఫెన్సింగ్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశ్, మురళీకృష్ణల కనుసన్నుల్లో ఈ వ్యవహారం సర్టిఫికెట్ల కుంభకోణం నడుస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. తెర వెనుక పలువురు ప్రముఖుల హస్తం కూడా ఇందులో ఉందనేది అంతర్గతంగా వినిపిస్తున్న టాక్. గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి కుమారుడికి మ్యాచ్ ఆడకపోయినా.. ఫెన్సింగ్ ఆడినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తోంది.
ఎంసెట్ సీటు కోసం:
న్యాయశాఖలో పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి కూడా పరిటాల శ్రీరామ్ అనుచరులు క్రీడా సర్టిఫికెట్ ఇష్యూ చేశారు. దాన్ని ఉపయోగించుకుని అతను ఎంసెట్ లో సీటు సాధించినట్లు చెబుతున్నారు. పలు రంగాల్లో స్పోర్ట్స్ కోటాకు ప్రాధాన్యం ఉండటంతో.. ఈ సర్టిఫికెట్ల దందా జోరుగా జరుగుతోందన్న వాదనలున్నాయి. ఈ దందాలో భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తే ఎదుర్కోవడానికి రాజకీయ నేతల అండ కావాలన్న ఉద్దేశంతో.. వారి పిల్లలకు, ప్రముఖుల పిల్లలకు సర్టిఫికెట్లు ఇష్యూ చేసినట్లుగా సమాచారం.
జేసీ తనయుడిపై ఆరోపణలు:
అనంతపురం ఎంపీ జేసీ తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు వస్తున్నాయి. ఒలింపిక్ అసోసియేషన్ కు చెందిన నిధులను దుర్వినియోగం చేశారని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం సోమవారం విజయవాడలో వెల్లడించారు. 2016నుంచే పవన్ ఈ వివాదంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేశ్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు ఒలింపిక్ అసోసియేషన్లు ఉండగా, సీఎం రమేశ్ వర్గంలో అనంతపురం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా పవన్ కుమార్ ఉన్నారు. గల్లా జయదేవ్ వర్గంలో పరిటాల శ్రీరామ్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.
రూ.18లక్షలు మాయం:
ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల నేపథ్యంలో పురుషోత్తం వర్గం దానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలన్నింటిని ఫ్రీజ్ చేసింది. అయితే 2016 జూన్ 9న ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి రూ.18 లక్షలు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేష్ సహా జీసీ రావు అనే మరో వ్యక్తిపై ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో వీరిపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. కోర్టులోను క్రిమినల్, సివిల్ కేసులు దాఖలు చేశారు.
అనంతపురం పరువు తీస్తున్నారు:
క్రీడారంగంతో సంబంధం లేకపోయినా.. రాజకీయ నేతలు అందులోకి చొరబడటం ఆ రంగాన్ని దెబ్బతీస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సర్టిఫికెట్ల కుంభకోణం, నిధుల దుర్వినియోగంతో అసలైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.
దానికి తోడు ఇద్దరు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తులే ఈ అవినీతికి పాల్పడటంతో జిల్లా పరువు మంట కలిసిపోయిందని పలువురు వాపోతున్నారు.
రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు క్రీడలను శాసిస్తుండటం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని మాజీ క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్బాల్, క్రికెట్ సహా చాలా క్రీడల్లోను అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.