తిరుమల శ్రీవారి దర్శనం వేళ మనస్థాపం - ఏకంగా గుడినే కట్టి, తనివితీరా..!!
తిరుమల శ్రీవారి దర్శనం అంటేనే ఒక అద్భుతం. స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధుడు గంటల తరబడి ఆర్తితో ఎదురు చూశారు. ఆనంద నిలయంలో కొలువైన ఆ దేవదేవుడిని కాసేపు అక్కడే నిలబడి కనులారా చూడొచ్చని ఆయన ఎంతో ఆశపడ్డారు. అయితే ఆ భాగ్యం దక్కనే లేదు. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారు. దీంతో తరువాత తానే సొంత స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
తనివి తీరా దర్శనం కోసం
శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిముకుంద పండా పదేళ్ల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. గోవింద నామాన్ని జపిస్తూ గంటల తరబడి స్వామి దర్శనం కోసం ఆర్తితో క్యూ లైన్ లో నిలబడి ఎదురు చూశారు. ఆనంద నిలయంలో కొలువైన ఆ దేవదేవుడిని కాసేపు అక్కడే నిలబడి కనులారా చూడొచ్చని ఆయన ఎంతో ఆశపడ్డారు.

అయితే ఆ భాగ్యం దక్కనే లేదు. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారు. తాను ఎనిమిది పదుల వృద్ధుడినని, అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా వినిపించుకోలేదు. చివరకు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. తల్లితో తన అనుభవం పంచుకున్న సమయంలో ఒక ఆలయం నిర్మాణం ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆచరణలో అమలు అవుతోంది.
సువిశాలమైన శ్రీవేంకటేశ్వర ఆలయం
నేడు శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గ పెట్రోలు బంకు వెనుక ఉన్న పండా తోటల్లో సువిశాలమైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

హరిముకుంద పండా పట్టణం నడిబొడ్డున వీరి కుటుంబానికి సుమారు వందెకరాల భూమి ఉంది. జంట పట్టణాల్లో 100 ఎకరాల్లో ఉండే పండాగారి కొబ్బరి తోటలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 12 ఎకరాల 40సెంట్ల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయం రూపుదిద్దుకుంటోంది. శ్రీవారితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవారి విగ్రహాలను ఏకశిలతో రూపొందించారు. నవగ్రహ దేవతలతో పాటు సకల దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి.
ప్రత్యేక ఆకర్షణగా
ఆలయం బయట ఆంజనేయుడు, గరుత్మంతుడి భారీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తిరుమల ఆలయం తరహాలో నిర్మాణాలు జరుగుతున్నాయి. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన కళాకారులు అద్భుత కళాఖండాలను చెక్కుతున్నారు. దాదాపు ఆరేళ్ల కిందట ఇక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ప్రారంభమైంది.
దీనికి దాతలు ఎవరూ లేరు. హరిముకుంద పండానే తమ సొంత ఆదాయంతో కట్టిస్తున్నారు. పూర్తిసేవా విధానంలో ఆలయం నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. పేద కుటుంబాల వివాహాల కోసం ప్రత్యేక కల్యాణమండపం సిద్ధం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేయడానికి వీలుగా కోనేరు తవ్వించారు. అభిషేకాలు, ప్రత్యేక పూజల కోసం యాగస్థలి, భక్తులు వేచి ఉండేందుకు విశ్రాంతి మండపాలు నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications