కిరణ్పై అలక: రిజైన్ యోచనలో శ్రీధర్ బాబు, బుజ్జగింపు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన శాఖను మార్చిన నేపథ్యంలో.. దానిని అవమానంగా భావిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు రాజీనామా యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు శాసన సభ వ్యవహారాలను శ్రీధర్ బాబు చూస్తున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ నేపథ్యంలో కిరణ్ ఆయన శాఖను మంగళవారం రాత్రి మార్చారు. శ్రీధర్ స్థానంలో శైలజానాథ్కు బాధ్యతలను అప్పగించారు.
శ్రీధర్ బాబుకు వాణిజ్య పన్నుల శాఖను కేటాయించారు. దీనిని తీసుకునేందుకు ఆయన ససేమీరా అంటున్నారు. శ్రీధర్ బాబు శాఖను మార్చడంపై తెలంగాణ ప్రాంత నేతలు గుర్రుగా ఉన్నారు. ఆ ప్రాంత మంత్రులు జానా రెడ్డి, శ్రీధర్ బాబు, సునిత లక్ష్మీ రెడ్డిలు గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు.

అయితే, తనకు తెలియకుండా శాఖను హఠాత్తుగా మార్చిన నేపథ్యంలో శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి పైన ఆగ్రహంతో, అలకతో ఉన్నారు. కిరణ్ తీరును అవమానకరంగా భావించిన శ్రీధర్ బాబు మంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచన చేశారు.
శ్రీధర్ బాబు సహచర మంత్రి జానా రెడ్డి, శాసన మండలి సభ్యులు డి శ్రీనివాస్లతో భేటీ అయ్యారు. రాజీనామా చేసేందుకే ఆయన మొగ్గు చూపారట. అయితే వారు బుజ్జగించినట్లుగా సమాచారం. అయితే, శ్రీధర్ బాబు రాజీనామా లేఖ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
శ్రీధర్ బాబు రాజీనామా చేయాలని ఆలోచించారని అయితే, ఇది సమయం కాదని తాము వారించామని, తాము తీసుకునే చర్యలు విభజనకు ఆటంకం కలిగించకూడదనే ఆలోచిస్తున్నామని మంత్రి జానా రెడ్డి చెప్పారు. శాఖ మార్పు అంశాన్నితాము అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. శుక్రవారం జరగనున్న భేటీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
నాతో సంప్రదించలేదు
తనను సంప్రదించి శాఖను మార్చారనే దాంట్లో నిజం లేదని శ్రీధర్ బాబు చెప్పారు. ముఖ్యమంత్రి తనకు కేటాయించిన కొత్త శాఖను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోనన్నారు. శాఖ మార్పు ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుందనేది వాస్తవమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నిర్ణయం సరైంది కాదన్నారు. వాణిజ్య పన్నుల శాఖను నిర్వహించేందుకు తన కంటే సమర్థులు ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications