ఆ కల నెరవేరడం కోసమే: రామ్మోహన్ నాయుడు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రతిపాదన
శ్రీకాకుళం: ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రతిపాదనపై ఎంపీ రామ్మోహన్నాయుడు స్పందించారు. విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచటానికే ఈ బిల్లును ప్రతిపాదించినట్లు తెలిపారు.
త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నందునా.. బిల్లు చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. అన్ని పార్టీలు రైల్వేజోన్కు మద్దతు ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు కోరారు.
కాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రైవేటు బిల్లు ప్రతిపాదనకు లోక్సభ సెక్రటేరియెట్ ఆమోదం తెలుపుతూ లేఖ రాసింది. ఒకవేళ ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందితే మూడు నెలల్లో రైల్వేజోన్ ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి.
విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, వాల్తేరు డివిజన్ కలిపి.. రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని రామ్మోహన్నాయుడు కోరారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు డిమాండ్ దశాబ్దాలుగా ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ రైల్వే జోన్ కు ప్రతీసారి మొండి చెయ్యే చూపుతున్న కేంద్రం.. ఈసారి ఎలా స్పందిస్తుందో చూడాలి.