ఎమ్మెల్యేగా పోటీచేస్తానంటున్న ఎంపీ... సర్దిచెబుతున్న చంద్రబాబు.. సమీకరణాల్లో మార్పు?
తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర పెట్టని కోట. 2019 ఎన్నికల్లో కంచుకోటలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదని, గత ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలన చేసుకొని చిన్న అలసత్వానికి కూడా తావులేకుండా పనిచేసి పార్టీని గెలిపించాలనే యోచనలో చంద్రబాబు పనిచేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన శ్రీకాకుళం నుంచి ఒక తలనొప్పిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎంపీ రామ్మోహన్నాయుడు ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని చెప్పడమే దీనికి కారణం. దీనివల్ల ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు మారతాయనే భావనతో ఉన్న బాబు అటు అవుననికానీ, ఇటు కాదనికానీ చెప్పలేదని తెలుస్తోంది.

మంత్రి అవ్వాలనే కోరికతో..
రెండుసార్లు ఎంపీగా విజయం సాధించిన రామ్మోహన్ ఎమ్మెల్యేగా పోటీచేయడంవెనక బలమైన కారణం ఉందని ఆయన అనుయాయులు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అవ్వాలనేది రామ్మోహన్ కోరికగా ఉందని, దీనివల్ల తాను రాజకీయంగా ఎదగడమే కాకుండా జిల్లావ్యాప్తంగా పార్టీని మరింత పటిష్టపరచడానికి వీలుంటుందని బాబుకు చెప్పినట్లు వెల్లడించారు. కేవలం ఎంపీగా తాను ఢిల్లీలోనే ఉండటంవల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉండటంలేదని అధినేతకు చెప్పినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గం కూడా ఖరారు
నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని, అక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న రమణమూర్తి మద్దతిచ్చారని, రాబోయే ఎన్నికల్లో ఇక్కడనుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి నరసన్నపేట మీద దృష్టిసారించినట్లు వెల్లడించారని సమాచారం. అక్కడి నుంచి పోటీచేయడానికి రమణమూర్తి కూడా మద్దతిచ్చారని చెప్పారంటున్నారు. రామ్మోహన్ నాయుడు నిర్ణయంవల్ల జిల్లా లో సమీకరణాలు మారిపోయే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోసారి ఎంపీగా పోటీచేయండి..
రానున్న ఎన్నికలు కీలకం కాబట్టి ఎంపీగానే పోటీచేయాలని చంద్రబాబు రామ్మోహన్ కు సూచించినట్లు తెలుస్తోంది. ఒకవైపు రామ్మోహన్ బాబాయ్ అచ్చెన్నాయుడు పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మంత్రి పదవి ఇవ్వడం ఖాయం. అంతేకాకుండా రామ్మోహన్ ఎమ్మెల్యేగా పోటీచేస్తే శ్రీకాకుళం నుంచి పోటీచేయడానికి అంతటి బలమైన అభ్యర్థిని తీసుకురావడం కూడా కష్టమనే భావనలో బాబు ఉన్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు తరుచుగా వస్తున్నాయి. ఇద్దరూ అసెంబ్లీకి పోటీచేస్తే రానున్న రోజుల్లో వీరిద్దరి మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంటుందని, ఆ ప్రభావం జిల్లాలో పార్టీపై పడి అంతిమంగా నష్టపోయే అవకాశం ఉందని బాబు యోచనగా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోట లాంటి జిల్లాలో విభేదాలు తలెత్తితే చేటు తెస్తుందని, దీన్ని మొదట్లోనే నివారించాలని బాబు అనుకుంటున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications