చిరంజీవి హోల్ సేల్, చంద్రబాబు రిటైల్: శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి చిరంజీవిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్కు హోల్ సేల్గా అమ్మితే.. చంద్రబాబు నాయుడు తన పార్టీని రిటైల్గా అమ్ముకున్నాడని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడిన చిరంజీవి, చంద్రబాబుకు తమను విమర్శించే అర్హత లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తమ పార్టీని ఉద్దేశించి చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. నైతికత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు.
రాజ్యసభకు ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నది నిజం కాదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో ఉండి కూడా బిఏసి సమావేశానికి రాని మీరా మమ్మల్ని విమర్శించేది అంటూ బాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా రాష్ట్ర విభజనకు అనుకూలమని గతంలో కేంద్రానికి ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగి రెడ్డి డిమాండ్ చేశారు. టిడిపి నేతలు కేంద్ర మంత్రుల కాళ్లు కాకుండా తమ పార్టీ అధినేత చంద్రబాబు కాళ్లు పట్టుకుని విభజన లేఖను వెనక్కి తీసుకోవాలని వారికి శోభానాగిరెడ్డి సూచించారు.