చార్మినార్ కట్టించానంటాడేమో: బాబుని ఏకేసిన శ్రీకాంత్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి శాసన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పదేపదే హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చెబుతుంటారని, చార్మినార్, గోల్కొండ కోట, ఫలక్నుమా ప్యాలెస్, అసెంబ్లీలను కూడా తానే కట్టించానని చెబుతారేమోనని ఎద్దేవా చేశారు.
రాజధాని విషయంలో తమ గోడు ఎంత వెలిబుచ్చినా అధికార పార్టీ ప్రకటన చేశాకే చర్చిస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు రావొద్దని, ప్రజలను రెచ్చగొట్టవద్దనే ఉద్దేశ్యంతోనే, చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ స్వాగతించారన్నారు. నాయకులకు సానుకూల దృక్పథం ఉండాలన్నారు.
చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేసిన ఏ ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. హంద్రీనీవా, తోటపల్లి సహా అన్ని ప్రాజెక్టుల ఘనత వైయస్దే అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఆలోచన చంద్రబాబుదే అయినా, వైయస్ దానిని పూర్తి చేశారన్నారు. తమ పార్టీ నేత వైయస్ జగన్ బయటకు వెళ్తే కూడా కామెంట్ చేశారని, ఇది సరికాదన్నారు.
విష్ణుకుమార్ రాజు ప్రశంస, ఎన్టీఆర్ పేరు పెట్టాలని దూళిపాళ్ల
ఈ రోజు సభ సజావుగా సాగేందుకు కృషి చేసిన జగన్కు, అభివృద్ధి వికేంద్రీకఱణను అనుసరించిన చంద్రబాబుకు కృతజ్ఞతలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. శాఖాధిపతులు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంతంలో ఉండాలనేదే తమ అభిప్రాయమన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి తాము సహకరిస్తామని చెప్పారు. తమకు ఐఐటీ ఇవ్వాలని కోరారు. ఏదేమైనా ప్రభుత్వం నిర్ణయాలను తాము ప్రశంసిస్తున్నామన్నారు. తెలుగు ప్రజలు గర్వించే మహానాయకుడు ఎన్టీఆర్ పేరును కొత్త రాజధానికి పెట్టాలని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు.