బొత్సకు ఎసరు!: పార్టీ నేతలు మద్యం వ్యాపారం వద్దు.. శ్రీకాంత్ రెడ్డి, కల్తీపై సిట్
కడప: మద్యం విషయంలో పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని, అలాంటప్పుడు పార్టీకి చెందిన నేతలు మద్యం వ్యాపారం చేయవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు అన్నారు. పార్టీ ఓ నిర్ణయం తీసుకున్నాక వైసిపి నేతలు మద్యం వ్యాపారం చేయడం సరికాదన్నారు.
పార్టీకి చెందిన నాయకులు ఎవరైనా మద్యం వ్యాపారంలో ఉంటే తప్పుకుంటే మంచిదని హితవు పలికారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అనే దానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.
కాగా, పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణకు మద్యం వ్యాపారం ఉన్న విషయం తెలిసిందే. జగన్ మంగళవారం మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

శ్రీకాంత్ రెడ్డి కృష్ణా జలాల పంపకం పైన కూడా మాట్లాడారు. కృష్ణా జలాల పంపకం పైన సుప్రీం కోర్టులో కేంద్రం సమర్పించిన తీర్పు తెలుగు ప్రజలకు ద్రోహం చేసేలా ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోదన్నారు.
కేంద్రం ముందు చంద్రబాబు నాయుడు మోకరిల్లారని ఎద్దేవా చేశారు. మిగులు జలాల మీద సంపూర్ణ హక్కులు చిట్ట చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును మరోసారి సమీక్షించాలన్నారు.
కల్తీ మద్యం ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు
విజయవాడలో కల్తీ మద్యం ఘటన పైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ మహేశ్ చంద్ర లడ్డా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు.
సిట్లో గ్రేహౌండ్స్ ఎస్పీ సెంథిల్కుమార్, డీఎస్పీలు టి కనకరాజు, ఎం వెంకటేశ్వర రావు, సీఐలు వైవీనాయుడు, కె శ్రీనివాస రావు, అబ్దుల్ కరీం, సిహెచ్ రాంబాబు, మీరా సాహెబ్లను నియమించారు. విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో సిట్ పని చేయనుంది.












Click it and Unblock the Notifications