డ్రగ్స్ వాడుతున్నాడేమో, పరిటాల దెబ్బకు పారిపోయాడు: జేసీపై శ్రీకాంత్ రెడ్డి
అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డ్రగ్స్ వాడి సభలకు హాజరవుతున్నట్లుగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కడప: అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డ్రగ్స్ వాడి సభలకు హాజరవుతున్నట్లుగా ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించి పులివెందుల బ్రాంచి కెనాల్కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ దివాకర్ రెడ్డి.. శ్రీకాంత్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. మీ ఇంటికొస్తా, మీ నట్టింటికి వస్తా అని సినిమా డైలాగులు చెబుతున్నారన్నారు. ఇలాంటి భాషను రౌడీలు వాడుతారని మండిపడ్డారు.
ఫ్యాక్షనిజంను రూపుమాపిన వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడం విడ్డూరమన్నారు. తాము సంస్కారం లేని భాషను ఉపయోగించమన్నారు. అలాగే, క్రమశిక్షణతో రాజకీయం చేస్తామని చెప్పారు. ఆయన జేసీ దివాకర్ రెడ్డి కాదని, జానావాకర్ రెడ్డి అన్నారు.
డ్రగ్స్ వాడుతూ సభలకు వస్తున్నారేమో
జేసీ దివాకర్ రెడ్డి డ్రగ్స్ వాడుతూ బహిరంగ సభలకు వస్తున్నారేమోనని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అందుకే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తాను జేసీ కన్నా రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు.
పరిటాలను చూసి పారిపోయావు
దివంగత నేత పరిటాల రవిని చూసి తాడిపత్రిలో నామినేషన్ వేయకుండా పారిపోయిన వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. తాను మీలా చెంచా రాజకీయాలను చేయనన్నారు. జేసీ దివాకర్ రెడ్డిలా దిగజారుడు రాజకీయాలు చేయనని చెప్పారు. చంద్రబాబు సమక్షంలోనే జేసీ రౌడీలా మాట్లాడారన్నారు.
'ఎవడయ్యా శ్రీకాంత్ రెడ్డి.. అంత మగాడా'
తనకు సంస్కారం ఉందని, ప్రాజెక్టుల పైన చర్చకు తాను సిద్ధమన్నారు. వేదిక సిద్ధం చేస్తే చర్చకు వస్తానని సవాల్ చేశారు. కాగా, 'ఎవడయ్యావాడు శ్రీకాంత్ రెడ్డి .. నా గురించి మాట్లాడతాడా! నా నాలుక కోస్తానంటాడా?..' అని జేసీ ఫైర్ అయ్యారు.