'రూ.53 లక్షలు ఖర్చు చేశా, విరాళాలివ్వండి.. అమరావతిని ఆపేయిద్దాం'
విజయవాడ: అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ.. నిర్మాణం నిలిపివేయించడానికి విరాళాల సేకరణ ప్రారంభించారు. తొలుత ఉమ్మడి హైకోర్టును, ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆయన ఆశ్రయించారు.
పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన అమరావతి నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, అనుమతుల విషయాన్ని సంబంధిత సంస్థలు చూసుకుంటాయని చెబుతూ సుప్రీం కోర్టు ఆయన పిటిషన్ కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో శ్రీమన్నారాయణ జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించాడు. దీనిపై విచారణ సాగుతోంది. ఇదే సమయంలో శ్రీమన్నారాయణ విరాళాలు సేకరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. విరాళాలు ఇస్తే అమరావతి నిర్మాణం నిలిపివేయిద్దామని చెబుతూ.. ఆయన విరాళాలు సేకరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
తాను ఇంత వరకు కోర్టు ఖర్చులకు రూ.53 లక్షలు ఖర్చు చేశానని, తన వద్ద డబ్బులు అయిపోయినందున పర్యావరణ ప్రేమికులు విరాళాలు ఇవ్వాలని నెల రోజులుగా శ్రీమన్నారాయణ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టింగులు పెడుతున్నారు. ఈ వ్యవహారం ఆదాయపన్ను శాఖ దృష్టికి వెళ్లింది. ఇప్పటి దాకా రూ.53 లక్షలు ఖర్చు పెడితే అందుకు సంబంధించి వివరాలు ఐటీ శాఖకు సమర్పించారా లేదా అనే కోణంలో దృష్టి పెట్టారు.