TTD: బ్రహ్మోత్సవాల వేళ నేరుగా శ్రీవారి దర్శనం..!!
Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం ఈ రోజు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడవాహనసేవ రాత్రి 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్లోకి అనుమతిస్తున్నారు. కేవలం గంట వ్యవధిలోనే స్వామివారి దర్శనం పూర్తవుతోంది.
నేడే అంకురార్పణ : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పరణ జరగనుంది. ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు రాత్రి 7 నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు.
రేపటి నుంచి వాహన సేవలు : అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. అలాగే మహారథం(చెక్క రథోత్సవం) ఉండదు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడేళ్లకు ఒకసారి పుష్పక విమానసేవ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా 19న గరుడ వాహనం, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాల తొలిరోజు అక్టోబరు 15న ఉదయం 9 నుండి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రద్దీ ఉంటుందనే అంచనాతో ప్రివిలేజ్డ్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను, ఆర్జిత సేవల్ని కూడా టీటీడీ రద్దు చేసింది.

భక్తులకు నేరుగా దర్శనం : బ్రహ్మోత్సవాల ప్రారంభ వేళ తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వారాంతం.. పండగ సెలవులు మొదలైనా క్యూ లైన్లలో భక్తుల ఎక్కువమంది లేరు. శనివారం ఉదయం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్లోకి అనుమతిస్తున్నారు. కేవలం గంట వ్యవధిలోనే స్వామివారి దర్శనం పూర్తవుతోంది. శ్రీవారిని శుక్రవారం 59,034మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చాయని టీటీడీ తెలిపింది.
అలాగే 22,391మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 19వ తేదీ సాయంత్రం శ్రీవారి గరుడోత్సవాన్ని 6.30 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications