కళ్లు చెదిరేలా తిరుమలలో శ్రీవారి లడ్డూ అమ్మకాలు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. గురువారం నాడు 66,304 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,811 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.51 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.05 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. 1.93 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,392 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

కాగా.. కిందటి నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూలు విక్రయం అయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచింది. ఎలాంటి కొరత లేకుండా లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందిస్తోంది. 1.27 కోట్ల లడ్డూలను టీటీడీ విక్రయించింది.
ఈ ఏడాది ఏప్రిల్లో 1,11,96,170, మే లో 1,21,35,528 లడ్డూలు విక్రయం అయ్యాయి. జూన్ లో ఈ సంఖ్య పెరిగింది. మొత్తం 1,26,81,805 లడ్డూలు అమ్ముడుపోయాయి. 2024 జూన్ లో 1,02,64,364, 2025 అదే నెలలో 1,19,21,353 లడ్డూలు విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఈ సంఖ్య కూడా భారీగా పెరిగింది. 1,26,81,805 వద్ద నిలిచింది. అంటే గత ఏడాది జూన్తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయం అయ్యాయి. ఇందులో 6.37 శాతం వృద్ధి కనిపించింది.
అలాగే 2024తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా విక్రయమవ్వగా 23.55 శాతం వృద్ధి నమోదైంది. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీలో టీటీడీ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందిస్తోంది.












Click it and Unblock the Notifications