స్టాలిన్ రూటే సపరేటు- తెలుగు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా : తమళ పాలిటిక్స్ లో నయా ట్రెండ్..!!
ప్రతీకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తమళనాడు పాలిటిక్స్. కానీ, ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారి పోయాయి. కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ కొత్త చరిత్ర క్రియేట్ చేస్తున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లోనూ చర్చకు కారణమవుతున్నాయి. తెలుగు ప్రజలు అటు స్టాలిన్ నిర్ణయాల పైన ఆసక్తిగా చూస్తున్నారు. తమిళనాడులో గతంలో జయలలిత- కరుణానిధి కాలంలో ఒకరు అధికారంలో ఉంటే..మరొకరి మీద ప్రతీకారం తీర్చుకోవటం తరచూ జరిగేది. దేశం మొత్తం తమిళ రాజకీయాల మీద అదే అభిప్రాయం నెలకొని ఉందేది.
స్టాలిన్ మార్క్ రాజకీయం...
ఇప్పుడు స్టాలిన్ సీఎం అయిన తరువాత...గత ప్రభుత్వ నిర్ణయాల అమల్లో బేషజాలకు పోవటం లేదు. తన తండ్రి రాజకీయ ప్రత్యర్ధి అమ్మ పేరుతో కొనసాగుతన్న వాటిని రద్దు చేయటం లేదు. జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను యధావిధిగా కొనసాగించాలని స్టాలిన్ నిర్ణయించారు. అంతే కాకుండా.. కరోనా విషయంలో వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలోనూ ప్రత్యర్ధి పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చారు. తన ప్రమాణ స్వీకార సమయంలో అన్నా డీఏంకే నేతలు పన్నీర్ సెల్వం..పళిని స్వామిలను తన టేబుల్ వద్దే కూర్చోబెట్టుకున్న ఫొటోలు స్టాలిన్ పరిణితిని స్పష్టం చేసాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్ధులకు మేలు చేసే నిర్ణయంగా ప్రశంసలు అందుకుంది.
తెలుగు రాజకీయాల్లో భిన్నంగా..
అయితే, ఏపీలో రాజకీయాల పైన ఇప్పుడు చర్చ సాగుతోంది. టీడీపీ అధికారంలోకి రాగానే ఆరోగ్య సేవలతో పాటుగా అనేక పథకాలకు ఎన్టీఆర్..కొన్నింటికి చంద్రబాబు పేరు పెట్టుకున్నారు. సొంత పేర్లతో ప్రచారం చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను రద్దు చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే అప్పటి వరకు ఉన్న పేరును మార్చేసి ఎన్టీఆర్ పేరుతో ఆరోగ్య శ్రీ కంటిన్యూ చేసారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని వైఎస్సార్ ఆరోగ్య శ్రీగా మార్చేసారు. ఇదే సమయంలో పలు పధకాలకు వైఎస్సార్ -జగన్ పేర్లను ఖరారు చేసారు.
చంద్రబాబు వర్సెస్ జగన్..
చంద్రబాబు హాయంలో ఆడపిల్లలకు సైకిళ్లు ఇవ్వాలనే నిర్ణయించి..కొనుగోలు చేసిన సైకిళ్లను సైతం వైసీపీ ప్రభుత్వం వినియోగించలేదు. గతంలో పని చేసిన టీడీపీ మంత్రులను జగన్ కేసుల పేరుతో వేధిస్తున్నారనే రాజకీయ విమర్శలు ఉన్నాయి. అయితే, అవినీతికి పాల్పడిన వారి పైనే సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని..ఇందులో రాజకీయ జోక్యం లేదనేది వైసీపీ నేతల వాదన. ఇక, ఇదే సమయంలో తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న మరో నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది.
స్టాలిన్ తాజా నిర్ణయంతో జాతీయ స్థాయిలో చర్చకు..
విద్యార్ధులకు అందించే స్కూల్ బ్యాగులను గతంలోని పన్నీర్ సెల్వం ప్రభుత్వం సిద్దం చేసింది. ఇందు కోసం దాదాపుగా రూ 13 కోట్లు ఖర్చు చేసింది. అయితే, ఇప్పుడు కరోనా తరువాత స్కూళ్ల ప్రారంభం సమయంలో ఆ బ్యాగులను పంపిణీ చేయాలా వద్దా..అనే సందేహం అధికారుల్లో మొదలైంది, వాటి పైన జయలలిత -పన్నీర్ సెల్వం ఫొటోలు ఉండటం.. స్టాలిన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో వారు ప్రభుత్వానికి విషయాన్ని నివేదించారు. 65 లక్షల బ్యాగులను ఎటువంటి మర్పులు అవసరం లేదని..వారి ఫొటోలు ఉన్నంత మాత్రాన తన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పేసారు.
Recommended Video
ప్రజాధనానికి స్టాలిన్ విలువ ఇస్తున్నారంటూ.
దీని కోసం రూ 13 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం కావటానికి వీళ్లేదని అధికారులకు స్పష్టం చేసారు. తన పాలన మీద అంత నమ్మకం ఉన్న స్టాలిన్ ..జయలలిత ఫొటోలతో తనకు జరిగే నష్టం ఏమీ లేదని చెప్పటం ద్వారా..తటస్థులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా..స్టాలిన్ ఈ ఆరు నెలల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు తమిళనాట నయా ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నాయి.