క్షమించండి: బాబు, బాధ్యత మరిచి.. సీఎం వెంటే ఉండి తంటా తెచ్చిన విఐపిలు!
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన ఘటన పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుసగా ఉన్న మృతదేహాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. బాధితులను పరామర్శిస్తూ, మీడియాతో మాట్లాడుతూ కంటతడిపెట్టారు.
లోపాలు ఉంటే క్షమించాలని భక్తులను కోరారు. పుష్కరస్నానంతో పుణ్యం దక్కుతుందని వచ్చి ఇంతమంది చనిపోవడం దురదృష్టకరమని, ఈ సంఘటన నన్నెంతో దిగ్ర్భాంతికి గురి చేసిందని, ముందు నుంచి కష్టపడి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకున్నామని, అయినప్పటికీ విధి వక్రించి ఇలాంటి దుర్ఘటన జరగడం ఆవేదన కలిగిస్తోందని, తనను ఎంతో బాధిస్తోందన్నారు.
ప్రమాద ఘటన పైన అధికారులకు, పోలీసులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల జరిగిందని చెబుతున్నారు. భక్తులకు సంబంధించిన అంచనాలు కూడా తప్పాయి. సకాలంలో స్పందించాల్సిన వాళ్లు స్పందించలేదు.
పుష్కర ఘాట్ పక్కనే గోదావరి రైల్వే స్టేషన్ ఉంది. స్టేషన్లో దిగిన వెంటనే ఘాట్కు రావడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంది. ఇది సరిగ్గా ఘాట్కు ఎదురుగా వస్తుంది. ఇక, ఇక్కడ ఎప్పుడూ ఆగని 19 రైళ్లు గోదావరి స్టేషన్లో ఆగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దాంతో, సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ వచ్చిన రైళ్లలోని భక్తులంతా ఇక్కడ దిగారు. మరీ ముఖ్యంగా, ప్రతీ పుష్కరాలకు తొలిరోజే స్నానాలు చేయడం ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖవాసులకు ఆనవాయితీ.
దాంతో అటునుంచి వచ్చే రైళ్లలోని భక్తులంతా గోదావరి స్టేషన్లోనే దిగారు. విజయవాడవైపు నుంచి వచ్చే భక్తులు సరేసరి. నేరుగా పుష్కర ఘాట్కు వచ్చారు. అయినా, గోదావరి స్టేషన్ నుంచి ఎంతమంది వస్తారనే ముందస్తు అంచనాలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు.
తొలిరోజు ఒక్క రాజమండ్రికే 18 లక్షల మంది వచ్చారని, పుణ్యస్నానాలు చేశారని అధికారుల అంచనా. అధికారులు మాత్రం కనీసం అందులో నాలుగో వంతు కూడా అంచనా వేయలేకపోయారని తెలుస్తోంది. పుష్కర ఘాట్లో మూడు రేవులున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మధ్య ఘాట్లో పుష్కర స్నానాలకు వచ్చారు. ఆ సమయంలో దాని పక్కనే ఉన్న రెండు ఘాట్లలోనూ కొంతమంది భక్తులు స్నానాలు చేస్తున్నారు. అయితే, అప్పటికే అక్కడ భక్తులతో కిక్కిరిసిపోగా, గోకవరం బస్టాండు, కోటగుమ్మం సెంటర్, వేణుగోపాలస్వామి గుడి వైపు నుంచి ఒక్కసారిగా వేలాదిమంది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు.
ఈ ఘాట్లలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ రద్దీని కనిపిస్తూనే ఉంది. అప్పుడే భక్తులను పుష్కర ఘాట్లోని మిగిలిన రెండు రేవులతోపాటు కోటిలింగాల ఘాట్కు, మిగిలిన ఘాట్లకు మళ్లించి ఉంటే తరలి వస్తున్న భక్తులను నియంత్రించి ఉంటే ఈ ప్రమాదం అసలు జరిగి ఉండేదే కాదంటున్నారు.
ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులకు సరైన దిశానిర్దేశం లేకపోవడం, ఘాట్లపై పూర్తి అవగాహన లేకపోవడంతో సమన్వయ లోపం కనిపించింది. పుష్కర ఘాట్లలో భక్తులకు దిశానిర్దేశం చేసేందుకు మైకులను ఏర్పాటు చేశారు.
ఆ సమయంలో గౌతమి, సరస్వతి ఘాట్లలతో తక్కువ రద్దీయే ఉంది. స్టేషన్ వద్ద ఘాట్కు పుష్కర ఘాట్ అని పేరు ఉండడం, అక్కడే హారతి నిర్వహించడంతో అందరి దృష్టీ దాని పైనే ఉంది. పుష్కరాలకు వచ్చే భక్తుల్లో ఎక్కువమంది రాజమండ్రి రేవుల్లోనే స్నానాలు చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 252 ఘాట్లు ఉన్నాయి.
ఘాట్ల వద్ద వచ్చి వెళ్లేందుకు అంబులెన్సులకు దారి కూడా లేదు. సిఎం చంద్రబాబు చేసిన స్నానఘట్టం వైపు అందరి దృష్టి పడింది. విఐపీలు అటువైపే మొగ్గు చూపారు. దీంతో భక్తులకు చాలా సమయం తీసుకుంది. సీఎం వెంటే ఉండి స్నానం చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్య అధికారులు, కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు వచ్చారు. ఇది కూడా నష్టం నష్టం చేసింది.