తప్పిన ప్రమాదం: స్టేజి కూలి కిందపడిన గీతారెడ్డి
మెదక్: జిల్లాలోని సిద్ధిపేటలో ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రి గీతారెడ్డికి ప్రమాదం తప్పింది. దళిత సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో సిద్ధిపేటలోని చైతన్యపురి కాలనీలో గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శనివారం మంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు.
అయితే సభా వేదికపై మంత్రి ఎక్కగానే ఒక్కసారిగా వేదిక కూలిపోవడంతో మంత్రి గీతారెడ్డి కిందపడినట్లు తెలిసింది. అయితే అక్కడే ఉన్న సహాయక సిబ్బంది ఆమెను పట్టుకోవడంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. వేదికపైకి ఎక్కువమంది నాయకులు ఎక్కడంతో ఒక్కసారిగా కూలిపోయినట్లు అక్కడున్నవారు చెబుతున్నారు.
మంత్రి గీతారెడ్డికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత వేదికను పటిష్టంగా నిర్మించారు. దీంతో కార్యక్రమాన్ని మంత్రి గీతారెడ్డి కొనసాగించారు. బుద్ధుడి విగ్రహావిష్కరణను చేపట్టిన తర్వాత ఆమె ఆ వేదికపై నుంచే ప్రసంగాన్ని కొనసాగించారు.