ఇళ్లు ముట్టడిస్తే: ఉండవల్లి, కొందరిది డబుల్ గేమ్: టిజి
హైదరాబాద్: ఇళ్ల ముట్టడితో రాజీనామాలు ఆమోదం పొందవని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం అన్నారు. తాము రాష్ట్ర విభజనను అడ్డుకునే దిశలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామన్నారు. తీర్మానానికి వ్యతిరేకంగా ఎవరు రాష్ట్రాన్ని విభజించరని చెప్పారు. 2014 వరకు రాష్ట్ర విభజన జరగదని చెప్పారు.
ఊహించి మాట్లాడను: బొత్స
తెలంగాణపై గురువారం కేబినెట్ నోట్ వస్తుందన్న దానిపై ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వేరుగా స్పందించారు. ఆంటోని కమిటీ రాష్ట్రానికి వచ్చి వెళ్లాక కేబినెట్ నోట్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే కేబినెట్ నోట్ వచ్చే విషయమై మాట్లాడుతూ... తాను ముందే ఊహించి మాట్లాడనని, ఏదైనా జరిగితేనే మాట్లాడుతానని చెప్పారు.
సమైక్యమే: ఆనం
తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. సీమాంధ్రలో ఉద్యమం ఎగిసిపడుతోందని, తామెవరం విభజన నిర్ణయాన్ని ఒప్పుకునేది లేదన్నారు. తామంతా సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామన్నారు. అధిష్టానానికి తమ వాదనలు వినిపిస్తామని చెప్పారు.
సీమాంధ్ర నేతల భేటీకి గైర్హాజరు
మంత్రుల క్వార్టర్సులో జరిగిన సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతల సమావేశానికి పలువురు గైర్హాజరయ్యారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, పితాని సత్యనారాయణ, బాలరాజు తదితరులు గైర్హాజరయ్యారు. కాగా, భేటీ అనంతరం వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసేందుకు వెళ్తున్నారు.
నేతలు డబుల్ గేమ్: టిజి
కొందరు నేతలు ఇక్కడో మాట.. ఢిల్లీలో ఓ మాట చెబుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ వేరుగా మండిపడ్డారు. కాసేపట్లో తాము ముఖ్యమంత్రిని కలవబోతున్నామని, అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తే వ్యతిరేకిస్తామని చెప్పారు. తమ వాదనను ఢిల్లీలో చెప్పాలని ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. సీమాంధ్ర నేతల భేటీ అనంతరం ఆయన మాట్లాడారు.