నేడు తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం- ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో దంచికొడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమమధ్య- దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఫలితంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య-వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం మరింత బలపడింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా రూపుదాల్చింది. దీని ప్రభావంతో అటు ఒడిశా, ఇటు ఏపీల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
నేడు ఈ వాయుగుండం తీరం దాటనుంది. ఒడిశా దక్షిణ ప్రాంతం- ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య గల గోపాల్ పూర్ వద్ద తీరాన్ని తాకుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేసింది. కాగా ఈ వాయుగుండానికి తోడు మరొక అల్పపీడనం జత అయ్యే అవకాశాలు లేకపోలేదని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
వాయవ్య బంగాళాఖాతం- దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావం కూడా ఈ రెండు రాష్ట్రాలపైనే అధికంగా ఉంటుందని తెలిపింది. రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీవర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 73 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా గుళ్లసీతారామపురంలో 66, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 60.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తూరులో 59.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications